దీపావళి పండగ సందర్భంగా విరామం తీసుకున్న అనంతరము రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలో పునర్ ప్రారంభం కానున్నదని టిపిసిసి మాజీ అధ్యక్షుడు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అక్టోబర్ 27న ఉదయం 6 గంటలకు ప్రారంభించి, నవంబర్ 7 వరకు పాదయాత్ర రాష్ట్రంలో కొనసాగనున్నదని పేర్కొన్నారు. నల్లగొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, అభిమానులు అక్టోబర్ 31న శంషాబాద్ వద్ద పాదయాత్రలో చేరి పాల్గొనాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. రాహుల్ యాత్ర కోసం రాష్ట్రంలో ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. యాత్ర లో ప్రజలు, కాంగ్రెస్స్ కార్యకర్తలు భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.