ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై రేపు సాయంత్రం ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్తో చర్చలు జరిపేందుకు సీఎం వై ఎస్ జగన్ తరలి వెళుతున్నారు. ఒడిశా సీఎంతో చర్చించాల్సిన అంశాలపై సీఎం జగన్ నేడు అధికారులతో చర్చించారు. మూడు అంశాలపై ఒడిశా సీఎంతో ఏపీ సీఎం చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నారు. జంఝావతి ప్రాజెక్టు ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నారు.
అందులో 24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని అధికారులు తెలియజేసారు. ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని అధికారులు తెలిపారు. ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిషా లో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు తెలిపారు. ఒడిషా లో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని అధికారులు వివరించారు. ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని రాష్ట్ర అధికారులు తెలిపారు. అలాగే ఆర్ అండ్ ఆర్కు సహకరించాలని ఒడిషాను కోరనుంది ఏపీ. కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను సీఎం ముందు ఉంచారు…విజయనగరం జిల్లా అధికారులు. కొఠియాలో దాదాపు
21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని సీఎంకు వివరించారు.. విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి. ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో పేర్కొన్నారు. అలాగే ఇటీవలే కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.