వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వికలాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు డబ్బుల్లేని జగన్ రెడ్డి ప్రభుత్వం తమపైకి నెపం నెడుతోందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు విమర్శించారు. టీడీపీ నేతలు, బూత్ లెవల్ కార్యకర్తలతో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తన రాజకీయ స్వార్ధం కోసం జగన్ రెడ్డి పింఛనర్ల పొట్ట కొట్టారని ఆయన అన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే రూ.4 వేల పింఛన్ ఇస్తాం. ఈ 2 నెలలు ఎవరికైనా పింఛన్ అందకుంటే అది కూడా కలిపి ఇస్తాం అని ఆయన స్పష్టం చేశారు.
అధికారం నుంచి దిగిపోతూ కూడా జగన్ రెడ్డి పైశాచికత్వం ప్రదర్శిస్తున్నారని, పేదలకు పింఛన్ ఇప్పించే వరకు టీడీపీ నేతలు పట్టువదలద్దు అని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. సంబంధిత జిల్లా కలెక్టర్లను కలిసి పేదవాళ్లకు పింఛన్ ఇళ్ల వద్దే అందేలా చూడాలని ఆయన అన్నారు. ప్రజాక్షేత్రంలో జగన్ రెడ్డిని దోషిగా నిలబెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ వచ్చాక జగన్ రూ.13 వేల కోట్లు గుత్తేదారులకు దోచిపెట్టారని చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. 15 రోజుల్లో ఎవరెవరికి ఎంత బిల్లులు ఇచ్చారో ప్రభుత్వం ప్రకటించాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తుంది. తటస్థంగా పనిచేసే వాలంటీర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వాలంటీర్లకు నైపుణ్యాభివృద్ధి శిక్షణతో మెరుగైన జీతం వచ్చేలా చేస్తాం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.