ఊహించని వేగంతో విస్తరిస్తున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సమాయత్తం అవుతున్నది. కరోనా కేసుల సంఖ్య రాష్ట్రంలో ఎనిమిదికి చేరింది. ఈ నేపథ్యంలో కరోనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర, అత్యున్నత సమీక్షా సమావేశాన్ని ప్రగతి భవన్లో నిర్వహించారు.
ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, మహమూద్ అలీ, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఎం సమీక్షిస్తున్నారు.