సీఎం జగన్ పర్యటనను విజయవంతం చేయాలని విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. విజయనగరం నగరపాలక సమావేశ మందిరంలో జరిగిన అధికారులు, సచివాలయాల అడ్మిన్ లు, పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు సీఎం జగన్ నేతృత్వంలో జరుగుతున్నాయని, అర్హత ప్రామాణికంగా పేదవాడి సొంత ఇంటి కల సాకారం అవుతోందన్నారు.
రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాం లేఅవుట్ లో అన్నివసతులు కల్పించేందుకు సంసిద్దతగా ప్రభుత్వం ఉందన్నారు. గుంకలాం లో అర్హులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడంతో పాటు గృహనిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. 30 తేదీ 9 గంటల కల్లా అర్హులను ఆయా సచివాలయ అడ్మిన్, పార్టీ శ్రేణులు సమన్వయంతో పని చేస్తూ అర్హులను సభాస్థలికి తరలించాలని అన్నారు. వైఎస్సార్సీపి ప్రభుత్వం అమలు చేస్తున్నసంక్షేమ పథకాలు పేదలకు సక్రమంగా అందేలా చూడాలన్నారు. నగరపాలక కమిషనర్ ఆర్ ఎస్ ఎస్ వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పీవీ సూర్యనారాయణరాజులు మాట్లాడారు.