తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో సమ అభివృద్ధికే టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ ప్రాధాన్యతనిస్తున్నారని ఇందులో భాగంగానే చేవేళ్ళ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యతనిస్తున్నట్లు ఎమ్మెల్యే, మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సోమవారం స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి మునిసిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
రూ. 8 కోట్లతో అభివృద్ధి పనులు..
జన్వాడ, మిర్జాగుడా, పిల్లిగుండ్ల, గోపులారం, దొంతన్ పల్లి, మోకీల, శంకర్ పల్లి మునిసిపాలిటీ పరిధిలోని బుల్కాపూర్, చిన్న శంకర్ పల్లి, శంకర్ పల్లి, సింగపూర్, బంగ్లాగడ్డ, పర్వేద, సంకేపల్లి, అంతప్పగూడా గ్రామాలలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. మోకీల, పర్వేద క్లస్టర్ లలో రూ. 22 లక్షలతో నిర్మించిన రైతు వేదికలు, రూ. 600 కోట్లతో 2604 రైతు వేదికలు, రూ. 7300 కోట్ల రైతుబంధు, చనిపోయిన రైతు కుటుంబాలకు 5 లక్షల రైతు భీమా తదితరాలతో రైతులకు పూర్తి ప్రయోజనం చేకూరుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, మహిళ సంఘాల బలోపేతం ద్వారా శంకర్ పల్లి మునిసిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.