నూతనంగా ఎన్నికైన కో-ఆప్షన్ సభ్యులు పట్టణాభివృద్ధి కి కృషి చేయాలని నల్లగొండ జిల్లా నకిరేకల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం రోజున చిట్యాల మున్సిపాలిటీ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక జరిగింది. ఎన్నికైన సభ్యులను అభినందించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌన్సిల్ సభ్యులకు తోడుగా ఉంటూ వారికి సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్నారు.
జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీలలో చిట్యాల మున్సిపాలిటీ అభివృద్ధిలో ముందుండేలా తాను ప్రయత్నిస్తానని అన్నారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకుని కొన్నిటిని పూర్తి చేసుకున్నామని, కొన్ని కొనసాగుతున్నాయని అన్నారు.
పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడంలో మున్సిపాలిటీ కార్యవర్గానికీ ప్రజలు సహకరించాలని చిరుమర్తి కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి, కమీషనర్ ఐతే ప్రభాకర్, వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కౌన్సిలర్లు శేపూరి రవీందర్, కోనేటి కృష్ణ, జమాండ్ల జయమ్మ, జడల పూలమ్మ, పందిరి గీత, జిట్టా పద్మ, సిలివేరు మౌనిక, రేమిడాల లింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
కో-ఆప్షన్ సభ్యులు వీరే
నేడు జరిగిన మున్సిపాలిటీలోని నాలుగు కో-ఆప్షన్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు స్థానాలు ఏకగ్రీవం కాగా రెండు స్థానాలకు బహిరంగ ఎన్నిక జరిగింది. ఎండి జమీరొద్దీన్, పాటి మాధవరెడ్డి లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రుద్రవరం పద్మ, ఎండి సల్మా లు చెరి 7 ఓట్లతో మెజార్టీ సాధించి ఎన్నికయ్యారు. వీరంతా తెరాస పార్టీకి చెందిన వారే. కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిని గ్రామ ప్రముఖులు పూల మాలలు, శాలువాలతో సన్మానించారు.