రెజర్లకు మద్దతుగా ఖమ్మంజిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు. భారత జాతీయ మహిళా సమాఖ్య జాతీయ సమితి పిలుపు మేరకు ఖమ్మం జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కేంద్రాలతో పాటు ఖమ్మం నగరంలో, బస్టాండ్లో సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పోటు కళావతి మాట్లాడుతూ మహిళా రెజర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బిజెపి ఎంపి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ పై చర్యలు తీసుకోవాలని ఢిల్లీలో మహిళా రెజర్లు ఆందోళన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు.
జాతీయ సమితి పిలుపులో భాగంగా రెజర్లకు మద్దతుగా మండల, జిల్లా కేంద్రాల్లో సంతకాల సేకరణ చేసి ఈ నెల 20న జిల్లా కలెక్టర్కు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు తాటి నిర్మల, సీతామహాలక్ష్మీ, పోటు మమత, పావులూరి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.