విజయనగరం జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు
శుభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలే జరగాలని, జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖఃసంతోషాలతో ఉండాలని ఏపీలో ని విజయనగరం జిల్లాపరిషత్ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. తన ఛాంబర్లో నిర్వహించిన మీడియా సమావేశంలో, జిల్లా ప్రజలకు, ప్రజా ప్రతినిధులుకు, అధికారులకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన
పాలనా సౌలభ్యం, పారదర్శకత కోసమే, రాష్ట్ర సీఎం జగన్ జిల్లాల విభజనకు శ్రీకారం చుట్టారని అన్నారు. తన పాదయాత్రలో ఇచ్చిన హామీమేరకు, ఎంతో దూరదృష్టితో ఆలోచించి, ప్రజాభీష్టం మేరకు జిల్లాల విభజన చేపట్టారని చెప్పారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన తరువాత, తగిన సమయమిచ్చి, ప్రజలనుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనలు తీసుకున్న తరువాతే, ముఖ్యమంత్రి తుది నిర్ణయం తీసుకున్నారని అన్నారు.
సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న గిరిజనులు, ఆ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేసినందుకు, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే చీపురుపల్లి ప్రాంతవాసుల ఏళ్లనాటి కలను నిజం చేస్తూ, మంత్రి బొత్స సత్యనారాయణ కోరిక మేరకు, చీపురుపల్లిలో రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
దివంగత సీఎం ఎన్టిరామారావు కూడా చీపురుపల్లిని రెవెన్యూ డివిజన్ చేయాలని ఆశించారని, గత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చీపురుపల్లి వాసులకు హామీ ఇచ్చినప్పటికీ, నెరవేర్చలేకపోయారని చెప్పారు. ప్రస్తుత సీఎం మాత్రమే,మంత్రి బొత్స కృషితో చీపురుపల్లి రెవెన్యూ డివిజన్ను ఏర్పాటు చేస్తూ, వారి ఆశలను నెరవేర్చారని తెలిపారు.
మెంటాడ మండల వాసుల మనోభిప్రాయానికి అనుగుణంగా, ఈ మండలాన్ని విజయనగరం జిల్లాలోనే ఉంచడానికి నిర్ణయంచారని చెప్పారు. చివరకు చంద్రబాబు నాయుడు కూడా, కుప్పంని రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారంటే, అది తమ ముఖ్యమంత్రి దార్శనికతను, పరిపాలనా దక్షతకు నిదర్శమని పేర్కొన్నారు.
2023 నాటికి రామతీర్ధసాగర్ పూర్తి
2024లో కూడా మళ్లీ జగన్ కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.ప్రాజెక్టులను పూర్తిచేసి, జిల్లాను సస్యశ్యామలం చేసే ఘతన సీఎం జగన్ దక్కుతుందన్నారు. ఇటీవల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించి, 2023 చివరినాటికి తారకరామతీర్ధసాగర్ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఆదేశించిన విషయాన్ని జెడ్పి ఛైర్మన్ వెల్లడించారు.
సారిపల్లి నిర్వాసితులకు 77కోట్లు విడుదల
దీనిలో భాగంగానే రామతీర్ధసాగర్ నిర్వాసిత గ్రామం సారిపల్లిలోని నిర్వాసితులకు పరిహారాన్ని చెల్లించేందుకు ఇటీవలే 77కోట్లు విడుదల చేశారని చెప్పారు. రామతీర్ధసాగర్ను ఇండస్ట్రియల్ ప్రాజెక్టుగా గుర్తించి, ఈ ప్రాజెక్టు నుంచి భోగాపురం ఎయిర్పోర్టుకు, పూసపాటిరేగ ప్రాంతంలోని ఫ్యాక్టరీలకు నీటిని అందించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
ముఖ్యంగా ఈ ప్రాజెక్టువల్ల చుట్టుప్రక్కల మండలాల రైతులకు సాగునీరుతోపాటు, విజయనగరానికి వచ్చే 40 ఏళ్లపాటు త్రాగునీరు అందుతుందని అన్నారు. దత్తిరాజేరుగు, గజపతినగరం, బొండపల్లి, మెంటాడ మండలాల్లోని సుమారు 15వేల ఎకరాలకు తోటపల్లి నుంచి సాగునీరు అందించే గజపతినగరం బ్రాంచ్ కెనాల్ను త్వరగా పూర్తి చేయాలని, ఆ సమావేశంలో సీఎం జగన్ ఆదేశించారని చెప్పారు.
ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని, ముఖ్యంగా మన జిల్లాను సస్యశ్యామలం చేసే సుజల స్రవంతి ప్రాజెక్టు నిర్మాణానికి, 3,500 కోట్లతో పిలిచిన టెండర్లు ఇటీవలే ఖరారయ్యాయని, త్వరలో పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఇవి కాకుండా తోటపల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ఇటీవలే 125కోట్లను విడుదల చేయగా, వీటిని రెండు ప్యాకేజీలుగా విడదీసి, పనులను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
అనుకోని వాతావరణ మార్పులు, అనివార్య పరిస్థితుల్లో స్వల్పంగా విద్యుత్ ఛార్జీలను పెంచడం జరిగిందని చెప్పారు. అయినప్పటికీ, 100 యూనిట్లలోపు అతి తక్కువ విద్యుత్ ఛార్జీలున్న రాష్ట్రం మనదేనని జెడ్పి ఛైర్మన్ పేర్కొన్నారు.
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం