తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు- మన బడి,మన బస్తీ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో ఎంపిక కాబడిన ఎంపిపిఎస్ బూరుగడ్డ,జడ్.పి.హెచ్.ఎస్ బూరుగడ్డ,ఎంపిపిఎస్ మాచవరం, ఎంపిపిఎస్ అమరవరం పాఠశాలలను హుజూర్ నగర్ ఆర్డిఓ కె.వెంకారెడ్డి, ఎంపిపి గూడెపు శ్రీనివాస్ సంయుక్తంగా పాఠశాలలను సందర్శించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హూజూర్ నగర్ మండలంలో 12 పాఠశాలలు ఎంపిక కాబడ్డాయని,ఆయా పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులను,ఏ ఈ లను వివరాలను అడిగి తెలుసుకున్నామని, పాఠశాలలు మెరుగు పరచుటకు ఆయా గ్రామ ప్రజలు కూడా సహకరించాలని,దీనికి సంబంధించి దాతల ఎకౌంట్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని,ఆ అకౌంట్లో నిధులను జమచేసి పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు.పాఠశాల యాజమాన్య కమిటీ రూపొందించిన నివేదికను తనిఖీ చేసి వాస్తవ అంశాలను పరిశీలించారు.అనంతరం పాఠశాలలో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు బీరెల్లి శ్రీనివాసరెడ్డి,కాంతయ్య,కిరీటం, శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్