చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కరోనా పాజిటీవ్ కేసులు పెరిగిపోవడానికి సరైన కారణాలు తెలుసుకోకుండా కొన్ని ఇంగ్లీష్ ఛానెల్స్ వార్తలు ప్రసారం చేయడం దురదృష్టకరమని ఇది తమ నైతిక స్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ సంఘం ఉపాధ్యక్షుడు, రేణిగుంట తాసిల్దార్ విజయసింహారెడ్డి అన్నారు.
రిపబ్లిక్ టివిలో వాస్తవాలు తెలుసుకోకుండా వార్త ప్రసారం చేయడం, దానికి అనుగుణంగా ఒక తెలుగు ఛానెల్ వార్తలు ప్రసారం చేయడం రెవెన్యూ సిబ్బంది మనోస్థయిర్యాన్ని దెబ్బతీస్తున్నదని ఆయన అన్నారు. అందరూ స్టే హోం స్టే సేఫ్ (ఇంట్లో ఉండండి సురక్షితంగా ఉండండి) అని అంటుంటే రెవెన్యూ, పోలీసు, మునిసిపల్ సిబ్బంది డు నాట్ స్టే హోం, ఇట్ ఈజ్ నాట్ సేఫ్ ఫర్ ది పీపుల్ (మీరు ఇంట్లో ఉండవద్దు అది ప్రజలకు మంచిది కాదు) అనే నినాదంతో పని చేస్తున్నారని ఆయన అన్నారు.
శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిర్వహించిన ర్యాలీలో రెవెన్యూ సిబ్బంది ఎవరూ పాల్గొనలేదని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిర్వహించిన ర్యాలీలో రెవెన్యూ సిబ్బంది పాల్గొనడం వల్లే వారికి కరోనా వచ్చిందని రిపబ్లిక్ టివి చెప్పడం శోచనీయమని ఆయన అన్నారు. ఇలా తెలిసీ తెలియకుండా వార్తలు ప్రసారం చేయడంవల్ల ప్రాణాలకు తెగించి పని చేసే రెవెన్యూ, పోలీసు, మునిసిపల్ సిబ్బంది మానసికంగా కుంగిపోతారని ఆయన అన్నారు. చదువురీత్యా వైద్యుడు అయిన చిత్తూరు జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా తమకు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు చెబుతున్నారని రేణిగుంట తాసిల్దార్ విజయసింహారెడ్డి అన్నారు. ఇంటి వద్ద భార్యా పిల్లలను వదిలిపెట్టి ప్రాణాలకు తెగించి పని చేస్తున్నామని ఈ విషయం గుర్తించాలని ఆయన అన్నారు. తాము చేసే పనిని గుర్తించకపోయినా ఫర్వాలేదు కానీ తమను అప్రదిష్టపాలు చేయవద్దని ఆయన కోరారు.