ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పంజాబ్ లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించడం లేదని తాజాగా ఆరోపించింది. అందుకోసం తక్షణమే చండీగఢ్ ను పంజాబ్ కు పూర్తిగా బదిలీ చేసేయాలని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ డిమాండ్ చేశారు.
పంజాబ్ అసెంబ్లీ సమావేశంలో ఈ మేరకు తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదించారు. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 1966 ద్వారా చండీగఢ్ పంజాబ్ కు, హర్యానాకు కూడా రాజధానిగా ఉన్నది. అలాగే చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది. అవిభాజ్య పంజాబ్లోని కొన్ని ప్రాంతాలను హిమాచల్ ప్రదేశ్కు ఇచ్చారు.
చండీగఢ్ పరిపాలన ఎప్పుడూ 60:40 నిష్పత్తిలో పంజాబ్, హర్యానా అధికారులచే నిర్వహించబడుతుంది. భాక్రా బియాస్ మేనేజ్మెంట్ బోర్డ్ (BBMB) వంటి ఇతర ఉమ్మడి ఆస్తులు కూడా ఇదే తరహాలో ఉంటాయి. ఇటీవలి అనేక చర్యల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ సమతుల్యతను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తోందని అసెంబ్లీ తీర్మానం పేర్కొంది.
ఇటీవల కేంద్రం BBMB పోస్ట్ల భర్తీకి చర్యలు తీసుకున్నది. సాంప్రదాయకంగా పంజాబ్లోని అధికారులచే ఉద్యోగాలను భర్తీ చేస్తారు. అయితే, కేంద్రం ఇతర రాష్ట్రాల వారితో ఈ పోస్టులను భర్తీ చేసేందుకు తలపెట్టింది. అదే విధంగా చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్లోని ఉద్యోగుల కోసం సెంట్రల్ సివిల్ సర్వీస్ రూల్స్ను ప్రవేశపెట్టిందని, ఇది గతంలో చేసుకున్న ఒప్పందాలకు విరుద్ధంగా ఉందని అసెంబ్లీ తీర్మానంలో పేర్కొన్నారు.
“పంజాబ్ రాజధానిగా చండీగఢ్ నగరం ఉండాలి. రాష్ట్ర విభజన జరిగినప్పుడు రాజధాని మాతృ రాష్ట్రంతోనే ఉంటుందని ఒప్పందం ఉంది. అందువల్ల, చండీగఢ్ను పంజాబ్కు పూర్తిగా బదిలీ చేయాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.