తెలంగాణలో కరోనా మరణాలు చూపెట్టడం లేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ముఖ్యమంత్రి వైఖరి ఆన్ సైoటిఫిక్ గా ఉందని, ఏక పక్ష ధోరణితో ప్రభుత్వ పెద్దలు వెళ్తున్నారని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ మేరకు సోమవారం రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ కు వినతి పత్రం సమర్పించారు.
పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ శాసనభా పక్షం నాయకుడు మల్ల బట్టి విక్రమార్క, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి తదితరులు గవర్నర్ తో భేటీ అయిన వారిలో ఉన్నారు. కరోనా నివారణ చర్యలు, రైతుల సమస్యలపై గవర్నర్ తో చర్చించినట్లు వారు తెలిపారు.
భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం ఎన్ని పరీక్షలు చేస్తున్నారో చెప్పాలని తెలంగాణ కరోనా ఫ్రీ కావాలని కోరుకుంటున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. చనిపోయిన వారికి కరోనా పరీక్షలు చేయవద్దని ఆదేశాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
ప్రతి బిపిఎల్ కుటుంబానికి 5 వేల రూపాయలు ఇవ్వాలని కోరామన్నారు. గవర్నర్ కి రేషన్ బియ్యం చూపించామన్న ఉత్తమ్.. నిరుపేదలకు నాణ్యమైన బియ్యం పంపిణీ చేయాలని డిమాండ్ చేశామన్నారు. 26 మార్చి రోజు కేజీ కంది పప్పు ఇస్తామని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ చెప్పారని… కానీ ఇప్పటి వరకు కంది పప్పు ఇవ్వలేదన్నారు.
ఎంత మంది వలస కూలీలు ఉన్నారో ప్రభుత్వం దగ్గర సరైన లెక్కలు లేవని..వలస కూలీలు వెళ్ళిపోతే … తెలంగాణకు భారీ నష్టం వాటిల్లుతుందన్నారు. వలస కూలీలకు సరైన సదుపాయాలు కల్పించాలని తెలిపారు. బస్తాలు లేక వరి ధాన్యం కొనుగోళ్లు ఆగిపోయాయని, అకాల వర్షాలతో వరి ధాన్యం తడిసిందన్నారు. తడిసిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. హమాలీల చార్జీలను ప్రభుత్వమే భరించాలని వారు అన్నారు. కందుల పైసలు రైతులకు ఇంకా ఇయ్యలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని చెప్పే కేసీఆర్…రాష్ట్ర ఆదాయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.