ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం అమ్మకాలను తిరిగి ప్రారంభించడం పై మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో మద్యం షాపుల వద్ద మహిళలు ధర్నాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మద్యం అమ్మకాలు నిలిపివేయాలని మహిళల ధర్నా చేశారు.
అనంతపురం నగరంలో మద్యం అమ్మకాలు లేకపోవడంతో శివారులో ఉన్న బుక్కరాయసముద్రం మద్యం దుకాణానికి మందుబాబులు ఎగబడ్డారు. దాంతో ముక్కరాయసముద్రం అంతా మందుబాబులతో నిండిపోయింది. దీనికి మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతపురం రెడ్ జోన్ లో ఉండటంతో ఇలా మందుబాబులు వీరంగం వేస్తుండటంతో ప్రజలు కూడా భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.
మద్యం కొనుగోలు కోసం కిలోమీటర్ల దూరం క్యూలు ఉండటం, ఎక్కడా సామాజిక దూరం పాటించకపోవడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణాజిల్లా వెంట్రప్రగడ లో మద్యం షాపు మూసేయాలని షాపు ముందు మహిళలు ధర్నా చేశారు. దాంతో ఆ షాప్ ని అధికారులు మూసేశారు. విజయవాడ తో పాటు ఇతర రెడ్ జోన్ ప్రాంతాల్లో మద్యం దుకాణాలు తెరిచేందుకు అధికారులు ప్రయత్నించారు కానీ చివరి నిమిషంలో బ్రేక్ పడింది. కేవలం గ్రీన్,ఆరెంజ్ జోన్ లలో మాత్రమే షాపులు తెరచుకున్నాయి.