చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా పాపులర్ అయిన నగరి ఎమ్మెల్యే రోజా ను రాజకీయంగా అణచి వేసేందుకు ఆ జిల్లాలోని వైసీపీ వర్గాలు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నాయి. ఎమ్మెల్యే రోజా కు ఎవరూ మద్దతు ఇవ్వకుండా ఆ జిల్లా పెద్దలు చాలా కాలంగా అందరిని కట్టడి చేస్తూ వస్తున్నారు.
ఆమెకు మద్దతు పలికిన మునిసిపల్ కమిషనర్ ను ఆమె అభీష్టానికి విరుద్ధంగా సస్పెండ్ కూడా చేయించారు. ఇలా వేటుపై వేటు వేస్తున్న ప్రత్యర్థి వర్గం రాజకీయంగానే కాకుండా అధికార కార్యకలాపాలలోనూ ఎమ్మెల్యే రోజాను దూరం పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నట్లు ఈ సంఘటన రుజువు చేస్తున్నది.
డిప్యూటీ సీఎం నారాయణస్వామి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, జిల్లా కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తా పుత్తురులో పర్యటించారు. దళితులకు కల్యాణమంటపం స్థల సేకరణ కోసం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ భూమిని పరిశీలించారు. అయితే ఈ కార్యక్రమానికి రోజాను పిలవలేదు.
తనకు సమాచారం ఇవ్వకుండానే తన నియోజకర్గంలో నారాయణస్వామి పర్యటించారని రోజా మండిపడ్డారు. నియోజకర్గంలో తాను అందుబాటులోనే ఉన్నాననే విషయం తెలిసికూడా… తనను పట్టించుకోకుండా, ప్రొటోకాల్ ఉల్లంఘించారని విమర్శించారు.