అధికారం దక్కలేదనే రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని విపక్షాలను ఉద్దేశించి ఏపీ సీఎం జగన్ పరోక్షంగా ఆరోపించారు. సంక్షేమ పథకాలకు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారన్నారు. విజయవాడలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసుల బాగోగుల గురించి ఆలోచించామన్నారు. పోలీసులు తమ కుటుంబాలతో గడపాలని.. వారికి కూడా విశ్రాంతి కావాలన్నారు. వీక్లీ ఆఫ్ను మొదటిసారిగా ప్రకటించిన ప్రభుత్వం తమదేనని చెప్పారు.
హోంగార్డులకు గౌరవ వేతనాన్ని కూడా పెంచామని.. కరోనాతో మృతిచెందిన పోలీసు కుటుంబాలకు పరిహారం ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ అత్యంత ప్రాధాన్యాంశమని చెప్పారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా జగన్ మాట్లాడారు. కేవలం అక్కసుతో పథకం ప్రకారమే రాష్ట్రంలో కుట్రచేస్తున్నారని ఆక్షేపించారు. ‘‘రాష్ట్రంలోని పిల్లలను డ్రగ్ అడిక్ట్స్గా ప్రపంచానికి చూపించే దుర్మార్గమైన ప్రయత్నం జరుగుతోంది. ఇది అత్యంత తీవ్రమైన నేరం.. అధర్మం. సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం, డీఆర్ఐ వివరణ ఇచ్చినా.. విజయవాడ సీపీతో పాటు డీజీపీ సైతం ఆ ఆరోపణలు అబద్ధాలు అని పదేపదే చెప్పినా లెక్కలేనితనం, అక్కసుతో వ్యవహరించారు.
కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకూ వెనకాడట్లేదు. అధికారం దక్కలేదనే ఈ విధంగా చేస్తున్నారు. చీకట్లో ఆలయాలకు సంబంధించిన రథాలను తగలబెడుతున్నారు. ఆఖరికి సీఎంపైనా అసభ్య పదజాలం వాడుతున్నారు. ముఖ్యమంత్రిపై పరుష పదజాలం వాడటం సమంజసమేనా? సీఎంను అభిమానించేవాళ్లు తిరగబడాలి.. భావోద్వేగాలు పెరగాలని వాళ్లు ఆరాటపడుతున్నారు. వాళ్లు గెలవలేదని రాష్ట్రం పరువు తీసేందుకూ వెనుకాడట్లేదు. గిట్టనివాడు పరిపాలన చేస్తున్నారని ఓర్వలేకపోతున్నారు’’ అని జగన్ ధ్వజమెత్తారు.