వైసీపీ అరాచక, అవినీతి పాలనపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దారి మళ్లించేందుకు ముఖ్యమంత్రి, డీజీపీ కలిసి జాతీయ చంద్రబాబు ఇంటిపై దాడి చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్ష్యులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో చంద్రబాబునాయుడు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
వైసీపీ రౌడీ మూకలు దేవాలయం లాంటి టీడీపీ కార్యాలయాలపై, టీడీపీ నాయకుల ఇళ్లపై దాడులకు పాల్పడ్డారని ఆయన అన్నారు. వైసీపీ డ్రగ్స్, అక్రమ వ్యాపారాలపై పట్టాభిరాం ప్రశ్నిస్తే వైసీపీ నేతలు, పోలీసులు కుమ్మక్కై ఆపీసుపై దాడికి పాల్పడ్డారు. ఇలాంటి ఘటన దేశంలో ఎప్పుడు జరగలేదు. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయి ఇది వాస్తవం కాదా? ఈ విషయం ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పోలీసులు సైతం చెబుతున్నారని ఆయన అన్నారు.
పోలీసుల సంస్మరణ దినోత్సవం సంధర్బంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు టీడీపీ నివాళి అర్పిస్తోంది. రాష్ట్రంలోని డీజీపీ, కొంతమంది పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో అమరులైన పోలీసుల ఆత్మ ఘోషిస్తోంది. ఇలాంటి పోలీసు వ్యవస్ధను దేశ చరిత్రలో ఎప్పుడు చూడలేదు, గూండాలు, రౌడీలను కొంతమంది పోలీసులు కమ్మక్కయ్యారని అచ్చెన్నాయుడు అన్నారు. డీజీపీ ఆపీసుకు కూతవేటు దూరంలో దాడి జరిగితే కనీసం డీజీపీ స్పందించలేదు, పోలీసుల పనితీరుపై ప్రజలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.
పట్టాభి ఇంటిపై దాడి చేసి 48 గంటలు గడిచినా ఇంతవరకు ఒక్కరిని అరెస్టు చేయని పోలీసులు పట్టాభినే అరెస్టు చేశారంటే ఈ డీజీపీ, పోలీసులు ఎంత దిగజారారో అర్దమౌతోందని ఆయన అన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడికి చేసిన రౌడీ మూకల్ని పోలీసులే సాదరంగా సాగనంపారుని ఆయన అన్నారు. టీడీపీ కార్యాయలంలో పట్టుబడ్డ పోలీసును కాపాడినందుకు, తిరిగి టీడీపీ నేతలపైనే హత్యయత్నం కేసులు పెట్టారు, డీజీపీ దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. డ్రగ్స్, కరెంట్ బిల్లులు, నిత్యవసర ధరలు, అప్పులు వీటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే దాడులు చేస్తున్నారు. మీరెన్ని డ్రామాలాడినా ప్రజలు మీకు బుద్ది చెప్పేందుకు సిద్దంగా ఉన్నారని ఆయన అన్నారు.