అక్రమ వలసదారులను గుర్తించడంలో భాగంగా తెలంగాణ పోలీసులు తీసుకున్న చర్యల్లో కొందరు ఆధార్ కార్డు కూడా పొందారని తేలడంతో వారు ఇచ్చిన సమాచారం మేరకు యుఐడిఎఐ ప్రాంతీయ కార్యాలయం 127 మంది కి విచారణ నోటీసులు జారీ చేసింది. ఇలా నోటీసులు జారీ చేయడంపై కొన్ని ప్రసార మాధ్యమాలలో విమర్శలు వచ్చాయి.
దీనికి స్పందిస్తూ ఆధార్ ఉన్నవారంతా భారత పౌరులు అనుకోవడానికి వీల్లేదని యుఐడిఎఐ వివరణ ఇచ్చింది. ఆధార్ చట్ట ప్రకారం ఆధార్ నమోదు చేసుకునే ముందు, ఒక వ్యక్తి భారతదేశం లో 182 రోజులు నివసించి ఉండాలన్న నిబంధనను, UIDAI తప్పనిసరిగా నిర్ధారించాలి.
అలాగే, అక్రమ వలసదారులకు ఆధార్ జారీ చేయవద్దని భారత సుప్రీం కోర్టు తమ కీలక తీర్పు లో యుఐడిఎఐని ఆదేశించింది. ఆధార్ పొందటానికి అర్హత లేని 127 మంది అక్రమ వలసదారులు ఆధార్ ను కలిగి ఉన్నట్లు రాష్ట్ర పోలీసులు ప్రాధమిక విచారణలో కనుగొని హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి నివేదిక ఇచ్చారు.
అలాంటి వారి ఆధార్ రద్దు చేయడానికి ధ్రువీకరణ పత్రాలను తీసుకొని వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేశారు. ఒక వేళ విచారణ లో ఎవరైనా నకిలీ పత్రాలను సమర్పించడం ద్వారా లేదా అక్రమ మార్గాల ద్వారా ఆధార్ ను పొందినట్లు నిరూపితమైతే, వారి ఆధార్ ను రద్దు చేయడం లేదా తాత్కాలికంగా నిలిపివేస్తారు.
పౌరసత్వంతో ఈ నోటీసులకు ఎటువంటి సంబంధం లేదు. వ్యక్తి ఆధార్ సంఖ్యను రద్దు చేయడం అతని జాతీయతతో ఎలాంటి సంబంధం లేదు. కొన్నిసార్లు, ఒక నివాసి వేరొకరి బయోమెట్రిక్స్ లేదా సరైనవి కాని పత్రాలను సమర్పించడం ద్వారా ఆధార్ పొందినట్లు ద్రువీకరించబడితే ఆధార్ నంబర్ రద్దు చేయడం అనివార్యం. UIDAI తరచూ తమ సేవలను మెరుగు పరుచుటకు గాను ఇటువంటి ప్రక్రియను అవలంబిస్తుంది. UIDAI నోటీసులు జారీ చేసిన 127 మంది వ్యక్తిగత విచారణ కోసం ఫిబ్రవరి 20న డిప్యూటీ డైరెక్టర్ ముందు తమ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలి.