అంబేద్కర్స్ ఇండియా మిషన్ (ఏఐమ్) ఆధ్వర్యంలో ఘనంగా 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని గురువారం శ్రీకాకుళం నగరంలో నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఏఐమ్ ప్రతినిధులు, సైనికులు పూలమాలలు వేసి నివాళ్ళులర్పించారు.
ఏఐమ్ సైనిక్ కన్వీనర్ కళ్ళేపల్లి హరికృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐమ్ శ్రీకాకుళం జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్ మీడియా మోనటరింగ్ కమిటీ సభ్యులు తైక్వాండో శ్రీను మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ కృషి కారణంగానే భారత్ పెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలిచిందని అన్నారు.
రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం అందరికీ ఆదర్శమన్నారు. ప్రతి ఒక్కరికీ ప్రాధమిక హక్కులు ఉండాలని రాజ్యాంగంలో పొందుపరిచారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు మెరుగైన విద్యను అందించడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.
రాజ్యాంగం అందరికి సమాన హక్కులు కల్పించిందన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అన్నారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధమైన చర్యలను ఉపేక్షించకూడదని ఆయన స్పష్టం చేసారు. భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఏఐమ్ జోనల్ ఇన్ చార్జి మాతా శామ్యూల్ సుధాకర్ అన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దేశంలో సార్వభౌమత్వ , సామ్యవాద, లౌకికవాద ప్రజా స్వామ్య, గణతంత్ర రాజ్యం అయ్యిందని తెలిపారు. రాజ్యాంగం ముఖ్య ఉద్దేశం అందరికీ సమాన హక్కులు, విధులు మరియు ఆదేశ సూత్రాలని పేర్కొన్నారు.
ఏఐమ్ జిల్లా కార్యదర్శి తాళాడ రవీంద్ర మాట్లాడుతూ రాజ్యాంగ ఫలితాలు అందిన రోజే దళితులకి పండుగ రోజని అన్నారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగం పట్ల గౌరవభావం పెంపొందించుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎఐమ్ సైనిక్ ప్రధాన కార్యదర్శి పెయ్యిల చంటి ఏఐమ్ నాయకులు కొత్తూరు సత్యన్నారాయణ, పాగోటి ప్రసాద్ ,మల్లమ్మ,మహేష్ ,బూర ఆనంద్ కుమార్ ,ఆర్.కె.శ్రీను తదితరులంతా పాల్గొన్నారు.