భవన నిర్మాణ కార్మికుల చట్టాల సవరణ ఖండిస్తూ సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శాంతి స్థూపం కార్మిక అడ్డా వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్, సి ఐ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు మాట్లాడుతూ రెక్కాడితే డొక్కాడని నిరంతర శ్రమజీవుల అయిన భవన, ఇతర నిర్మాణ కార్మికుల శ్రమను దోచి, పెత్తందార్లు, బడా కార్పోరేటు వ్యవస్థకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుందని, ఇది సరైనది కాదని విమర్శించారు.
1996 భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని సవరణ చేసి, కార్మికులు ప్రస్తుతం పొందుతున్న అరకొర సంక్షేమ పథకాలను కూడా రాకుండా అన్యాయం చేసిందని, కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ధ్వజ మెత్తారు. కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని కార్మిక చట్ట సవరణను వెనకకు తీసుకోకపోతే ఉద్యమాన్ని మరింత బలోపేతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి, షేక్ సైదా, బంక శ్రీనివాసరెడ్డి, షేక్ ముస్తాఫా, కె. ఏలియా, రామకృష్ణ, గోపి, పెద్దబ్బాయి, శ్రీను, సైదులు, వినాయకరావు, మల్లయ్య, హరి, నాగేశ్వరరావు, షేక్ బాబులు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.