హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి కోర్టులో తప్పుడు సమాచారం సమర్పించారని కోరుకొండ ఎస్ఐ, తహసీల్దార్పై రాజమహేంద్రవరం జడ్జి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. సివిల్ తగాదాల నేపథ్యంలో దళిత మహిళ బోర్ర పద్మావతి ఇంటిని ఎమ్మార్వో, ఎస్ఐ స్వాధీన పరుచుకున్నారు. దీనిపై బాధితురాలు హైకోర్టును ఆశ్రయించింది.
విచారణ జరిపిన న్యాయస్థానం తహసీల్దార్ ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేస్తూ తక్షణమే ఇంటిని బాధితురాలికి స్వాధీనపరచాలని గతంలో హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఇంటిని స్వాధీనపరచకుండా తహసీల్దార్, ఎస్ఐ హైకోర్టులో తప్పుడు ప్రమాణ పత్రం దాఖలు చేశారు.
ఉద్దేశపూర్వకంగా హైకోర్టు ఆదేశాలను రాజకీయ నాయకుల ప్రోత్సాహంతో ఆరు నెలల నుంచి ఒక కుటుంబాన్ని రోడ్డుపాలు చేశారని బాధితురాలి తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ హైకోర్టులో వాదనలు వినిపించారు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కనీసం వాటిని పట్టించుకోకుండా పక్కన పడేసారని.. తహసీల్దార్, ఎస్ఐపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు.
హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి తప్పుడు సమాచారం సమర్పించారని తహసీల్దార్, ఎస్ఐపై రాజమహేంద్రవరం న్యాయమూర్తి రిపోర్టు సమర్పించారు. ఆ నివేదికను ఆధారం చేసుకుని తహసీల్దార్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరై వివరణ ఇవ్వవలసిందిగా హైకోర్టు ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించి కోర్టులో తప్పుడు సమాచారం ఇవ్వటాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని జస్టిస్ రమేష్ పేర్కొంటూ తదుపరి విచారణ వారం రోజులు వాయిదా వేశారు