అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నామినేటెడ్ పోస్టును తమకు చెప్పకుండా స్వీకరించినందుకు భారతీయ జనతా పార్టీ సంచయితా గజపతిరాజుకు షో కాజ్ నోటీసు జారీ చేసింది. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (సింహాచలం) ట్రస్టు బోర్డు చైర్మన్ గా, మహారాజా అలక్ నారాయణ్ సొసైటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మన్ సాస్) చైర్మన్ గా సంచయితా గజపతిరాజు కొద్ది రోజుల కిందట ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.
గజపతి వంశానికి చెందిన పి వి జి రాజు 1958లో స్థాపించిన మన్ సాస్ ట్రస్టు, సింహాచలం ట్రస్టు వారసత్వంగా గజపతి వంశానికి చెందిన మగపిల్లలకు సంక్రమిస్తుంది. పి వి జి రాజు మరణానంతరం ఆయన పెద్ద కుమారుడు ఆనంద గజపతి రాజు ఈ రెండు బోర్డులకు చైర్మన్ గా నియమితులయ్యారు.
ఆ తర్వాత ఆయన మరణించడంతో ఆనంద గజపతి రాజు సోదరుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు అశోక్ గజపతి రాజు ఆ రెండు పదవులను స్వీకరించారు. ఆ నాటి నుంచి వారసత్వంగా వచ్చిన ఆ రెండు బోర్డులను ఆయననే నిర్వహిస్తున్నారు. వేలాది ఎకరాల భూములు, కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న ఈ రెండు బోర్డులను ఎంతో హుందాగా అశోక్ గజపతి రాజు నిర్వహించేవారు.
కేవలం నెలకు ఒక రూపాయి, రెండు రూపాయలు అద్దె చెల్లించి ఉండేవారు వేలాది మంది ఈ భూములను, భవనాలను, షాపులను అనుభవిస్తూ ఉంటారు. వారంతా విజయనగరం రాజు తమకు ఇచ్చిన సౌకర్యం ఇది అని ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. రాష్ట్రంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బోర్డులను ఎలాగైనా కదిలించాలని ప్లాన్ చేసుకున్నది. దాంతో పావులు కదిపారు.
ఆనంద గజపతి రాజు రెండో భార్య అయిన ఉమా గజపతి రాజు రెండో కుమార్తె అయిన సంచయితా రాజు ను రంగంలోకి దించారు. ప్రభుత్వేతర సంస్థ నిర్వహిస్తూ, బిజెపిలో క్రియాశీలంగా ఉన్న సంచయితా ను రాత్రికి రాత్రే ఈ రెండు బోర్డులకు చైర్మన్ గా చేస్తూ వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జీవోలు జారీ చేసింది.
ఈ పదవులు స్వీకరించే నాటికి సంచయిత భారతీయ జనతా యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్నారు. బిజెపికి సమాచారం ఇవ్వకుండా అనుమతి తీసుకోకుండా పదవులు స్వీకరించడంపై సీరియస్ గా ఉన్న బిజెపి షోకాజ్ నోటీసు ఇవ్వడం రాజకీయంగా సంచలనం కలిగించే అంశమే.
ఈ నిర్ణయం బిజెపి వైసిపి మధ్య ఏవైనా సంబంధాలు ఉంటే వాటిని కట్ చేసే విధంగా ఉంది. ఆమె సమాధానం సబబుగా లేకపోతే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని బిజెపి నాయకులు చెబుతున్నారు.