కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు జరుగుతున్న సార్వత్రిక సమ్మె ఉధృతంగా సాగుతున్నది. నేటి తెల్లవారుజామన విజయవాడ లోని పండిట్ నెహ్రు బస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొన్నిది. అదే విధంగా జాతీయ రహదారిపై వామపక్ష పార్టీలు నేతలు ఆందోళనకు దిగారు. దాంతో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వామపక్ష నేతలు రామకృష్ణ, బాబురావు, కాంగ్రెస్ పార్టీ నేత నరహారశెట్టి నరసింహరావు, మైనారిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అని అన్నారు. ఎన్ఆర్సీ, సీఏఏలను తక్షణమే రద్దు చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధాన వల్లే ఈరోజు భారత్ బంద్ చేపట్టామని, బంద్ కు వర్తక, వాణిజ్య, విద్యా సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు పలుకుతున్నారని ఆయన అన్నారు.