ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు జిల్లా ప్రజలకు జగన్ ప్రభుత్వం..విద్యుత్ చార్జీలు పెంచి కరెంట్ షాక్ ఇచ్చిందని ఏపీలోని విజయనగరం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్, సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, సీపీఎం ఎమ్.ఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పి.మల్లిక్ లు తీవ్రంగా విమర్శించారు. ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో ఒక్క చాన్స్ ఇవ్వండి ప్రజాసంక్షేమ పాలన అందిస్తానని చెప్పిన జగన్నన్న మాట తప్పి, మడమ తిప్పారని విమర్శించారు.
ఈమేరకు విజయనగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి మయూరి జంక్షన్ వరకు నిరసన ప్రదర్శన చేసి అనంతరం ఆర్టీసి కాంప్లెక్స్ చేరుకుని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుగత అశోక్, తమ్మినేని సూర్యనారాయణ, పి.మల్లిక్ లు విలేకులతో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బాబు బాదుడే బాదుడని తనకు ఒక్క చాన్స్ ఇస్తే ఈ బాధలు లేకుండా చేస్తానని చెప్పారని గతాన్ని గుర్తు చేసారు.
అయితే అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం చేసిన వాగ్దానాలు విస్మరించి చెత్తపన్ను, ఆస్తిపన్ను ,ఓటీఎస్ పన్నులు పెంచిందన్నారు. ఇప్పుడు తాజాగా విద్యుత్తు ధరలు పెంపుతో సామాన్యుడి నడ్డి విరిచారని ఆగ్రహం వ్యక్తంచేశారు. 13 స్లాబులుగా ఉన్న వాటిని 6 స్లాబులకి కుదించడం దుర్మార్గపు చర్య అన్నారు. కోటీశ్వరులకి తక్కువగా పెంచి, పేద, సామాన్య ప్రజలకు ఎక్కువగా పెంచడం అంటే జగన్మోహన్ రెడ్డి కి పేదల పట్ల ఉన్న నిర్లక్ష్యం తేటతెల్లం అవుతుందన్నారు.
ఫ్యాన్ గుర్తుకు ఓటెయ్యండి మీ ఇంట్లో వెలుగులు విరజిమ్ముతామని చెప్పిన జగనన్న ఇప్పుడు పేదల ఇళ్లల్లో దీపాలు ఆర్పేస్తున్నారని విమర్శించారు. పెంచిన కరెంట్ చార్జీలు తగ్గించకపోతే భవిష్యత్తులో ప్రజా సహకారంతో కరెంట్ పోరు తీవ్రతరం చేస్తామని నేతలు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తుమ్మి అప్పలరాజు దొర, టి.జీవన్, జిల్లా సమితి సభ్యులు అప్పరుబోతు జగన్నాధం, పొందూరు అప్పలరాజు, పొందూరు రాంబాబు, ఎ.ఐ.ఎస్.ఎఫ్ జిల్లా కార్యదర్శి బూర వాసు, సీపీఎం నాయకులు టి.వి.రమణ, పి.రమణమ్మ, సుధారాణి, రవికుమార్, జగన్మోహన్, రామ్మోహన్, రాము, ఆర్.ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.