ఉమ్మడి జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయానికి వచ్చిన మహిళా భక్తులు ఇక్కడ తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేస్తుండగా ఓ యువకుడు చరవాణిలో చిత్రీకరణకు యత్నించిన ఘటన కలకలం రేపింది. రామయ్య దర్శనం కోసం రెండు కుటుంబాలు ఇక్కడకు వచ్చాయి.ఇద్దరు మహిళలు ఆలయ సమీపంలోని తాత్కాలిక మరుగుదొడ్లలో స్నానం చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో వెంటిలేటరు నుంచి ఓ యువకుడు చేతిలో చరవాణితో లోపలకు తొంగిచూస్తుండగా వారు గమనించి గట్టిగా కేకలు వేశారు.
దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీనిపై భద్రతా సిబ్బందికి మౌఖికంగా ఫిర్యాదు చేయడంతో వారు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టినా యువకుడి ఆచూకీ లభించలేదు. పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలు కూడా కొన్నిరోజులుగా సక్రమంగా పనిచేయడం లేదు. ఈ విషయంపై డిప్యూటీ ఈవో నటేష్బాబు మీడియాతో మాట్లాడుతూ మహిళల స్నానపుగదులు, వస్త్రాలు మార్చుకునే గదుల వద్ద భద్రతా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని పేర్కొన్నారు.