40.2 C
Hyderabad
May 2, 2024 18: 02 PM
Slider ఖమ్మం

చివరి ఆయకట్టుకు సాగు నీరు

#khammam

నీటిపారుదల శాఖ అధికారులు చిట్ట చివరి ఆయకట్టుకు సాగు నీరు అందేలా పటిష్ట చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.  ఐడిఓసి లోని సమావేశ మందిరంలో నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల అధికారులతో యాసంగి (రబీ) సీజన్ లో సాగునీటి సరఫరాపై జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుండి పాలేరు రిజర్వాయర్ లోకి ఇప్పటికి 19 టీఎంసీ ల నీరు వచ్చినట్లు తెలిపారు. గత యాసంగిలో 1.72 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా, అది ప్రస్తుతం 2.25 లక్షల పైచిలుకుకు పెరిగింది. ప్రస్తుత యాసంగికి సాగునీటి సరఫరాకి ప్రణాళికాబద్ధంగా కార్యాచరణ చేయాలన్నారు. నాగార్జున సాగర్ లో తగినంత నీరు ఉందని, అవసరం మేరకు నీటి సరఫరా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. హెడ్ ఎండ్ లో ఉన్న రైతులు, చివరి ఆయకట్టు రైతుకు నీరు చేరేలా సహకారం అందించాలన్నారు. నీటిపారుదల అధికారులకు ఈ విషయమై సహకరించాలని, ఈ దిశగా రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. నీటిపారుదల, వ్యవసాయ, విద్యుత్ శాఖల మధ్య సమన్వయం ఉండాలన్నారు. నీటిపారుదల శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వారి వారి పరిధిలో క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ, చురుకుగా ఉండాలని, ఏ సమస్య ఎదురైనా పరిష్కరించే విధంగా సిద్ధంగా ఉండాలన్నారు. ప్రస్తుత యాసంగికి అవసరమైన తడి సరిగ్గా జరగట్లేదని, రైతుల నుండి ఆందోళనలు వస్తున్నట్లు తెలిపారు. సిఇ క్షేత్ర పరిధిలో చివరి ఆయకట్టు వరకు పర్యటించి, సమస్యలు అవగతం చేసుకుంటూ ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన అన్నారు. పాలేరుకు వచ్చిన నీరు దామాషా ప్రకారం సత్తుపల్లి చివరి ఆయకట్టుకు అందేలా చూడాలన్నారు.  చివరి ఆయకట్టుకు నీరందించే బాధ్యతను ఇఇ వెంకటేశ్వర రావు కి అప్పగించినట్లు మంత్రి తెలిపారు. 

సమావేశంలో జెడ్పి చైర్మన్ లింగాల కమల్ రాజ్ మాట్లాడుతూ, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల నీరు సమృద్ధిగా ఉన్న రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మొత్తం ఆయకట్టును కాపాడాలన్నారు. రైతులు ప్రభుత్వం మీద నమ్మకంతో పంటలు వేశారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. పంపిణీ లోపాన్ని సరిదిద్దే చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ మాట్లాడుతూ, యూనిట్ అధికారిగా సిఇ కి బాధ్యత ఉందన్నారు. సిఇ జిల్లాను సమన్వయం చేయాలన్నారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ, నీటిపారుదల శాఖలో పెద్ద సంఖ్యలో సిబ్బంది ఉన్నట్లు, శాఖలో సమన్వయ లోపం తలెత్తకుండా చూడాలన్నారు. పాలేరు రిజర్వాయర్ నుండి చివరి ఆయకట్టుకు నీరు అందే క్రమంలో తరుగును ముందే తీసి, మిగతా నీటిని పంపిణీ చేయాలన్నారు. రైతులు ఎంతో వ్యయ ప్రయాసాలకోర్చి సాగు చేస్తారని, పంటకు నీరు రాకపోతే నష్టపోతారని, సైన్టిఫిక్ గా నీటిని కేటాయించాలని ఆయన తెలిపారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య మాట్లాడుతూ, నీటి కేటాయింపుల్లో నాగార్జున సాగర్ ఒప్పంద రైతులకు అన్యాయం జరుగుతుందన్నారు. నాగార్జున సాగర్ నుండి వచ్చిన నీటిలో పై ప్రాంతాలకు ఎన్ని టీఎంసీ లు, చివరి ఆయకట్టు ప్రాంతాలకు ఎన్ని టీఎంసీలు వాడారో తెలుపాలన్నారు. రెండవ పంట కొరకు కేవలం 8 టీఎంసీల నీరు మాత్రమే చివరి ఆయకట్టుకు ఇచ్చినట్లు తెలిపారు. వారాబంది దామాషా ప్రకారం చేపట్టడం లేదని ఆయన అన్నారు. నాగార్జున సాగర్ లో 519 అడుగుల నీరు ఉన్నప్పుడే నీటికి ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు 557 అడుగులు ఉండగా సాగునీటికి ఇబ్బందులు ఎందుకని అన్నారు. సాగునీటి అధికారుల వైఫల్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన తెలిపారు. వారాబంది అన్ని ప్రాంతాలకు దామాషా ప్రకారం పంచాలన్నారు.

Related posts

కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్‌!

Sub Editor

ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు

Satyam NEWS

మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతాం

Satyam NEWS

Leave a Comment