అమరావతి నుంచి పూర్తి స్థాయి రాజధానిని ఎత్తేసి మరో రెండు చోట్లకు మార్చే అంశంపై వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. రైతుల ఆందోళనలు కొనసాగుతున్నా వారి ఆందోళనను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపించలేదు.
అంతే కాకుండా సీఆర్ డిఏ బిల్లు కౌన్సిల్ లో వివాదాస్పద పరిస్థితుల్లో చిక్కుకు పోయిన విషయం కూడా తెలిసిందే. వీటన్నింటికి మించి రాష్ట్ర హైకోర్టులో కేసులు పెండింగులో ఉన్న విషయం కూడా తెలిసిందే. ఇవన్నీ ఇలా ఉన్నా నేడు రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశం సందర్భంగా చేసిన గవర్నర్ ప్రసంగంలో మూడు రాజధానుల ప్రస్తావన వచ్చింది. పరిపాలన వికేంద్రీకరణే అభివృద్ధికి మంత్రం అని గవర్నర్ తెలిపారు.
మూడు రాజధానుల విభజనకు చట్టబద్దమైన ప్రక్రియ కొనసాగుతోందని ఆయన విస్పష్టంగా ప్రకటించారు. పరిపాలన రాజధానిగా విశాఖ, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఏర్పాటే తమ ప్రభుత్వ ఉద్దేశం మని గవర్నర్ తెలిపారు. మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నాం.. నిర్మించి తీరుతాం ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకే అని గవర్నర్ సంకేతాలు ఇచ్చారు.