లాక్ డౌన్ కారణంగా ప్రతి నెల విద్యుత్తు రీడింగ్ తీయాల్సిన సిబ్బంది బిల్లులు తీయకపోవడంతో ఆ ప్రభావం వినియోగదారులపై పడుతున్నది. విద్యుత్ శాఖ అధికారులు ఏప్రిల్, మే, జూన్, మూడు నెలల విద్యుత్ బిల్లులను ఒకే మారు తీయడంతో స్లాబ్ లెవల్ మారింది.
ప్రతి నెల యావరేజ్ గా 50 నుండి 100 యూనిట్ల లోపు వినియోగించే వారికి 180 నుండి రెండు వందల యాభై రూపాయలు వరకు విద్యుత్ బిల్లులు వచ్చేవి. కానీ మూడు నెలలకు ఒకసారి బిల్లు తీయడంతో పదిహేను వందల నుండి రెండు వేల రూపాయల వరకు అధిక బిల్లులు వచ్చాయి.
180 నుండి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించే వారికి 600 రూపాయల నుండి ఏడు వందల అరవై రూపాయలు వరకు యావరేజ్ బిల్లులు వచ్చేవని, ఇప్పుడు మాత్రం మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయల వరకు అధిక బిల్లులు వస్తున్నాయి.
విద్యుత్ శాఖ అధికారులు ప్రతి నెల విద్యుత్ రీడింగ్ చేసినట్లయితే సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఇంత భారం పడేది కాదు. ఈ విద్యుత్ చార్జీలు చూస్తుంటే కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఉంది. తక్షణమే తమ డిమాండ్లు పరిష్కరించాలని, కరోనా విపత్తు సమయంలో ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో పీడించి వసూలు చేయడం శోచనీయమని, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎండి పాషా మాజీ జెడ్పిటిసి గల్లా వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాస్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు సుతారి వేణుగోపాల్, ఎస్ కె బిక్కన్ సాహెబ్, కోల మట్టయ్య, పాశం రామరాజు,ముశం సత్యనారాయణ,సమ్మెట సుబ్బరాజు, దొంతగాని జగన్ తదితర నాయకులు పాల్గొన్నారు.