బాపట్ల పార్లమెంట్ ను ఎస్సి రిజర్వేడ్ చేయడం చారిత్రాత్మక తప్పు అని అహంకారపూరితంగా మాట్లాడిన బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి దళిత ద్రోహి అని బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ విమర్శించారు. బుధవారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న నరేంద్ర వర్మ కోన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ దళితుల ఓట్లతో గెలిచిన కోన రఘుపతి నేడు వారినే అవమానించేటట్టు మాట్లాడటం మంచి పద్ధతి కాదు. భారత రాజ్యాంగం దళితులకు ఇచ్చిన హక్కుల ప్రకారం వారికి అవకాశాలు కల్పిస్తుంటే, కోన వ్యాఖ్యలు ఏమో వారు రాజకీయంగా ఎడగకూడదు అనేలా ఉన్నాయి
. దళితుల పార్టీ అనే ప్రగల్భాలు పలికే వైసీపీ పార్టీ నిజస్వరూపం ఏంటి అనేది కోన మాటలు బట్టి అర్థం అవుతుంది. అంటే దళితులు మీ కింద బానిసలుగా ఉండాలి అనేదే మీ ఉద్దేశ్యమా?, వారు రాజకీయంగా వృద్ధి చెందకూడదా? ఇదేనా మీ విధానము అని ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రశాంతంగా ఉన్న బాపట్ల ప్రజల మధ్య కుల కుంప్పట్లు రాజేసి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్న కోన తీరు గర్హనీయం. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. తక్షణమే కోన రఘుపతి ఆయన వ్యాఖ్యలకు దళితులకు క్షమాపణ లు చెప్పాలని, ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దళితులు కోనకు తగిన బుద్ధి చెప్పి రాజకీయ సమాధి కడతారని నరేంద్ర వర్మ హెచ్చరించారు.