నంద్యాల జిల్లా శ్రీశైలం మహా క్షేత్రంలో అంగరంగ వైభవంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆలయ పుష్కరిణి వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన నీరాజన మండపాన్ని మంత్రి ప్రారంభించారు. సిద్దిధాయిని అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ దేవి దర్శనమిచ్చారు.
అశ్వ వాహన సేవలో భాగంగా స్వామి అమ్మవార్లను అశ్వ వాహనంపై అధిరోహింపజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామోత్సవం మేళ తాళాలతో నందీశ్వరుడు రాగ మంగళ వాయిద్యాలతో కోలాటాలు నృత్యాలు చేస్తూ కనుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో లవన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి సభ్యులు పాల్గొన్నారు.