విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 17 నుంచి శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు ప్రారంభం అవుతాయి.
9 రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నది. అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దుర్గమ్మ దర్శనమివ్వనున్నది.
18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా, 19న శ్రీ గాయత్రీ దేవిగా, 20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా, 21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దుర్గమ్మ దర్శనమివ్వనున్నది.
అదే విధంగా 22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, 23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా, 24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషాసురమర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్నది.
25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం ఉటుంది. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం జరుగుతుంది.
కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం ఉంది. గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నారు. రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనభర్జన పడుతున్నారు.