అర్హులైన పేదలందరికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నా క్షేత్ర స్థాయిలో అది అమలు జరగడం లేదు. గ్రామ సచివాలయ సిబ్బంది చెయ్యి తడిపడమో, వైసీపీ నాయకులతో చెబితేనో తప్ప కంప్యూటర్ లో డేటా నమోదు చేయడం లేదు. శ్రీకాకుళం పట్టణం 34 వ డివిజన్ కాకి వీధికి చెందిన అర్హులైన 64 పేద కుటుంబాలు ఇళ్ల పట్టాల నెల రోజుల క్రితం దరఖాస్తులు చేసుకున్నారు.
అయితే డివిజన్లో పనిచేస్తున్న సిబ్బంది ఈ 64 మంది దరఖాస్తులను నేటి వరకు కంప్యూటర్లలో డేటా నమోదు చేయలేదు. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసినవారు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నారు. కానీ 34 వ డివిజన్ సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీనికి కారణం ఈ 34 డివిజన్ వార్డు వై. ఎస్. ఆర్. సి పి, వార్డు ఇంచార్జ్ అయిన ఖలీల్ అనే వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారు.
అతను సొంత వ్యాపారానికి పరిమితమై వార్డుల్లో పర్యటించడం లేదు. ఆయన చెబితే కానీ కంప్యూటర్ లో నమోదు చేసేది లేదని సిబ్బంది చెబుతున్నారు. ఇదేం పద్ధతో అర్ధం కాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా నగర మున్సిపల్ కమిషనర్, రెవిన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ ఈ 34 డివిజన్ పై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు.