ఈ నెల ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అమరావతి సచివాలయంలోని మూడు, నాలుగు బ్లాక్ లను కరోనా కారణంగా మూసి వేయడంతో మంత్రి వర్గ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశం చర్చనీయాంశమైంది.
దాదాపు 12 మంది మంత్రుల ఛాంబర్లు మూడు, నాలుగు బ్లాకుల్లో ఉంటాయి. 3,4 బ్లాకుల్లో పని చేసే సచివాలయ ఉద్యోగులు నేడు విధులకు హాజరు కాలేదు. హైదరాబాద్ నుంచి వచ్చిన 250 మంది సచీవాలయ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటీవ్ రావడం, అతను ఉన్న క్వారంటైన్ అపార్ట్ మెంట్ లో మరో 12 మంది ఉండటం సత్యం న్యూస్ పాఠకులకు తెలిసిందే.
ఈ 13 మంది మూడు, నాలుగు బ్లాకుల్లో తిరగడమే కాకుండా పలువురిని కలిశారు. శని ఆది వారాలు సెలవు దినాలు కావడంతో వారెవరూ సచివాలయానికి రాలేదు. అయితే మూడు నాలుగు బ్లాకుల్లో పని చేసే సిబ్బంది రావద్దని అధికారికంగా చెప్పకపోవడంతో కొంత కన్ఫ్యూజన్ ఉంది.
దాంతో వారు సచివాలయ ఉద్యోగుల సంఘం వారిని సంప్రదించగా మూడు నాలుగు బ్లాకుల సిబ్బంది రావద్దని చెప్పడంతో నేడు ఎవరూ హాజరు కాలేదు. ఈ రెండు బ్లాక్ లను నేడు పూర్తిగా శానిటైజ్ చేశారు. ఇది ఇలా ఉంటే మరో నాలుగు రోజుల్లో జరగాల్సిన మంత్రివర్గ సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశం తెరపైకి వచ్చింది. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహిస్తారా లేక విశాఖపట్నంలో ఏదైనా అతిథి గృహంలో మంత్రి వర్గ సమావేశం నిర్వహిస్తారా అనే అంశం ఇంకా ఖరారు కాలేదు.