రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో అధ్యాపకుల భర్తీపై నిరుద్యోగుల ఎదురుచూపులు మరింత ఆలస్యం అవుతున్నాయి. ఖాళీలను కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీచేయాలని ప్రభుత్వం గత ఏప్రిల్లో జరిగిన మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించింది. దాని ఏర్పాటుపై జూన్లో జీఓ ఇచ్చింది. అది అమల్లోకి రావాలంటే వర్సిటీల చట్టాల్లో సవరణ చేయాలి. గత అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందగా దానిపై గవర్నర్ తమిళిసై కొన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో వెళ్లి సమాధానమిచ్చారు. గవర్నర్ ఆమోదించి బిల్లు చట్టరూపం దాలిస్తే వెంటనే నియామకాలు చేస్తామని సర్కారు చెబుతోంది. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో దాదాపు 2,500 వరకు బోధన సిబ్బంది ఖాళీలను భర్తీ చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అది ఎప్పుడు నెరవేరుతుందో చూడాలి. పాఠశాలల్లో విద్యా సామర్థ్యాలు పెరగాలని పట్టుబడుతున్న విద్యాశాఖ ఉపాధ్యాయుల ఖాళీలను నింపడంలో మాత్రం జాప్యం చేస్తోంది.
132 డిగ్రీ కళాశాలల్లో 85 చోట్ల శాశ్వత ప్రిన్సిపాళ్లే లేరు. కళాశాల, ఇంటర్, సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని 5 వేలకుపైగా కాంట్రాక్టు అధ్యాపకుల కొలువులను క్రమబద్ధీకరిస్తామని ప్రభుత్వం గత మార్చిలో ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో మొత్తం బోధన సిబ్బంది పోస్టులు 4,007. ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ అధ్యాపకులు 1,200 మంది మాత్రమే. కాంట్రాక్టు విధానంలో 860, అతిథి అధ్యాపకులు మరో 850 మంది ఉన్నారు. జూనియర్ కళాశాలల్లో మొత్తం 6,008 పోస్టులుండగా, రెగ్యులర్ అధ్యాపకులు 900లోపే ఉన్నారు. కాంట్రాక్టు అధ్యాపకులు 3,500 మంది వరకు ఉన్నారు. ఇవన్నీ ఎప్పుడు భర్తీ చేస్తారోనని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు.