జీహెచ్ఎంసీ బడ్జెట్ – 2020లో రాబడులు, ఖర్చులు, మిగులు తదితరాలపై సోషల్ మీడియాలో వస్తున్నవార్తలు అవాస్తవమని ఇప్పటికే ఆయా పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు సంబంధించి పెద్ద మొత్తంలో నిధులు చెల్లించామని, కాంట్రాక్టర్లు తప్పుడు ప్రచారం చేస్తే బ్లాక్ లిస్టులో పెడతామని తద్వారా భవిష్యత్లో వారికి లభించే పనుల్లో కోతలు గానీ ఉంటాయని చెప్పకనే చెబుతుండడం విశేషం.
ఈ నేపథ్యంలో బల్దియా ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయని, ఇప్పటికే కాంట్రాక్టర్లకు రూ. 909.17 కోట్ల బిల్లులు చెల్లించామని, జీహెచ్ఎంసిపై తప్పుడు ప్రచారం చేపట్టే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో ఉంచుతామని బల్దియా స్పష్టం చేసింది.
సెప్టెంబర్ 11 తేదీ వరకు రూ. 909.17 కోట్లను చెల్లించినట్లు జిహెచ్ఎంసి విడుదల చేసిన ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఎస్.ఆర్.డి.పి, సి.ఆర్.ఎం.పి, జె.ఎన్.యు.ఆర్.ఎం, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రూ. 1102.17 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉండగా సెప్టెంబర్ 11 లోపే రూ. 909.17 కోట్లు చెల్లించినట్లు స్పష్టం చేసింది. బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నఆరోపణలు వాస్తవం కాదని తెలిపింది. తప్పుడు ప్రచారం చేపట్టే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచడంతో పాటు కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించింది.
2020 సెప్టెంబర్ 11వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు కేవలం రూ. 193.54 కోట్ల బిల్లులు మాత్రమే చెల్లించాల్సి ఉందని, వీటిని కూడా దశలవారీగా చెల్లిస్తామంది. దేశంలోనే జీహెచ్ఎంసి ఆర్థికపరమైన నిర్వహణ, పరిపాలన విషయంలో అన్ని మున్సిపాలిటీలకన్నాఅత్యంత మెరుగ్గా ఉండడంతో ఏఏ రేటింగ్ కూడా లభించిందన్న విషయాన్ని ఆ ప్రకటనలో జీహెచ్ఎంసీ పేర్కొంది.
ఇక కోవిడ్-19 మహమ్మారితో టౌన్ ప్లానింగ్ ద్వారా లభించే ఆదాయం తగ్గినప్పటికీ లాక్ డౌన్ సమయంలో రోడ్డు, ఫ్లైఓవర్లు, జంక్షన్లు తదితర పనులను విజయవంతంగా చేపట్టామని స్పష్టం చేసింది. కాగా, ఇటీవలే జీహెచ్ఎంసీలో వచ్చిన వరదలు, ఎన్నికల నిర్వహణ వల్ల రెవెన్యూ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టి సారించకపోవడంతో కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు దశలవారీగా చేపట్టామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి 2020 ఏప్రిల్ నుండి నవంబర్ వరకు రూ. 564.92 కోట్లను జీహెచ్ఎంసికి విడుదల చేసిందని, 2020 డిసెంబర్ నుండి 2021 మార్చి వరకు నెలకు రూ. 78 కోట్ల చొప్పున మరో రూ. 312 కోట్లు విడుదల కానున్నాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పట్ల తప్పుడు ప్రచారం నిర్వహించే కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెడతామని ఆ ప్రకటనలో హెచ్చరించడం గమనార్హం.