సంక్షేమం , అభివృద్ధిని రెండు కళ్ళుగా చేసుకొని రాష్ట్ర సీఎం జగన్ పాలిస్తున్నారని, వాటి ఫలాలు పేదలందరికీ అందాలని విజయనగరం జిల్లా ఇంచార్జ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు తెలిపారు. భోగాపురం ఎయిర్ పోర్ట్, మెడికల్ కళాశాల తదితర ప్రాజెక్ట్ లు జిల్లా అభివృద్ధికి ఎంతగానో తోడ్పడతాయని, ఇరిగేషన్ ప్రాజెక్టులతో జిల్లా సస్యస్యామలం అవుతుందని అన్నారు.
కలెక్టరేట్ ఆడిటోరియం లో జిల్లా సమీక్ష సమావేశం ఇంచార్జ్ మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు ఈ సమావేశం లో అందించిన సూచనలకు , సలహాలకు అధికారులంతా స్పందించి చర్యలు చేపట్టాలన్నారు. త్వరితగతిన స్పందించి ప్రజలకు మేలు జరిగేలా చూడాలని అన్నారు.
ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్ట్ క్రింద అందవలసిన పరిహారం ఇంకా అందలేదని, ఆర్ అండ్ ఆర్ త్వరగా క్లియర్ చేయాలనీ అన్నారు. కలెక్టర్ స్పందిస్తూ వెంటనే క్షేత్ర స్థాయి పర్యటన చేసి గ్రామస్థులతో మాట్లాడి వారి సమస్యలను విని అందుకు తగ్గట్టుగా నివేదిక ఇవ్వాలని సబ్ కలెక్టర్ భావన కు సూచించారు.
కురుపాం కు చెందిన దీర్ఘకాలిక వ్యాధుల పించన్ల కు అర్హులైన వారిని తొలగించారని ఇంకా వారికీ మంజూరు కాలేదని ఉప ముఖ్యమంత్రి తెలుపగా డి.ఎం.హెచ్.ఓ స్పందిస్తూ 138 పించన్లు ప్రాసెస్ లో ఉన్నాయని ఈ నెలాఖరు నాటికీ వస్తాయని తెలిపారు. నాగూరు సచివాలయ పరిధి లో భూమి లేని ముగ్గురుకీ రైతు భరోసా పడిందని, విచారణ చేసి సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవాలని సూచించారు.
ధాన్యం సేకరణ పై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల వద్ద నున్న ప్రతి గింజను కొనుగోలు చేయాలనీ ఆదేశించారు. రైతుల వద్ద ఇంకా 75 వేల మెట్రిక్ టన్నులు ఉన్నాయని ప్రభుత్వం తో మాట్లాడి మొత్తం కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య కోరగా మంత్రి పై విధంగా స్పందించారు. లక్ష వరకు అక్నాలేజ్మేంట్లు ఇవ్వవలసి ఉందని తెలిపారు.
పౌర సరఫరాల మేనేజర్ స్పందిస్తూ ఇంతవరకు 3లక్షల,74వేల 680 మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు తెలిపారు. హౌసింగ్ పై మాట్లాడుతూ జగనన్న కాలనీ లలో మౌలిక వసతులు, అప్రోచ్ రోడ్ లు వెంటనే వేయాలన్నారు. ఇళ్ళ నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు.
15 రోజుల్లో ఇసుక కొరత తీర్చేందుకు చర్యలు
జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు మాట్లాడుతూ ఇసుక కొరతను తీర్చడానికి ప్రతి మండలానికి ఒక స్టాక్ పాయింట్ ను గుర్తించి 15 రోజుల్లో ఇసుక డిపో లను ఏర్పాటయ్యేలా చూడాలని ఆదేశించారు. పెద్ద లే అవుట్ల దగ్గరకే ఇసుక సరఫరా జరిగేలా చూడాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. నాటు బళ్ల తో ఇసుక తరలించే వారి పై ఎలాంటి కేసు లు పెట్టరాదని జిల్లా ఎస్. పి దీపిక ను కోరారు.
జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు సమావేశం లో వెల్లడించిన అంశాల పై అధికారులంతా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి మాట్లాడుతూ అధికారుల నిర్లక్ష్యం వలన అనర్హులకు పించన్ మంజూరు జరిగిందని, ఆ తర్వాత దానిని రద్దు చేసారని, అందుకు బాధ్యులైన అధికారుల పై చర్యలు తీసుకోవాలని కోరారు.
బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి చిన్న అప్పల నాయుడు మాట్లాడుతూ గత వేసవి లో వేసిన బోర్ బావులకు ఇప్పటికి విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేదని వాటిని వినియోగించకపోతే అవి పాడై పోవడమే కాక రైతుకు ఉపయోగపడవని అన్నారు. ద్వామా పి.డి మాట్లాడుతూ వాటిని విద్యుత్ శాఖకు అప్పగించడం జరిగిందని, లైన్ ఎస్టిమేషన్ లు వేయడం జరిగిందని తెలిపారు.
విజయనగరం ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్ ,సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర మాట్లాడుతూ యూరియా కొరత తో రైతులు ఇబ్బంది పడుతున్నారని, కొన్ని చోట్ల బ్లాకు మార్కెట్ లలో అమ్ముతున్నారని, 1 బి రిజిస్టర్ ప్రకారంగా ఇవ్వాలని సూచించారు.
ఈ సమావేశం లో అరకు ఎం.పి గొట్టేటి మాధవి, ఎమ్మెల్సీలు డా. సురేష్ బాబు, రఘు వర్మ, ఇందుకూరి రఘు రాజు, ఎమ్మెల్యేలు అలజంగి జోగారావు, బడ్డుకొండ అప్పల నాయుడు , కడుబండి శ్రీనివాస రావు తదితరులు పలు సమస్యల పై మాట్లాడారు. ఈ సమావేశం లో సంయుక్త కలెక్టర్లు డా. కిషోర్ కుమార్, డా.మహేష్ కుమార్ , మయూర్ అశోక్, పి.ఓ ఆర్. కూర్మనాద్, జే. వెంకట రావు, డి.ఆర్.ఓ గణపతి రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.