నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కోటగిరి మండలం రాంగంగానగర్ గ్రామంలో రూ. 2.51 కోట్లతో నూతనంగా నిర్మించిన 40 డబుల్ బెడ్ రూం ఇళ్ళను, కొల్లూరు గ్రామంలో రూ. 7.50 లక్షలతో నూతనంగా నిర్మించిన SC కమ్యునిటీ హాల్ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని106 గ్రామాలలో అన్ని వసతులతో రూ. 500 కోట్లతో 5000 ఇళ్ళు నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గానికి కేటాయించిన కోల్డ్ స్టోరేజ్ తో కూడిన గోదాంను రాంగంగానగర్ గ్రామ సమీపంలో నిర్మించడానికి ప్రతిపాదనలు పంపామని తెలిపారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇల్లు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడలేని విధంగా పేదల కోసం డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి ఇస్తున్నారని మంత్రి తెలిపారు. దసరా నాటికి లక్ష ఇల్లు పేదలకు ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే మమ్మల్ని ఆదేశించారని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.