రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించడం శుభసూచకమని, ఆ కేంద్రాన్ని తప్పకుండా ఆదిలాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చల దత్తాత్రేయ డిమాండ్ చేశారు.
నాణ్యమైన పత్తి పండించడంలో ఆసియా ఖండంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోనే జాతీయ స్థాయి పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. అన్ని రకాల నాణ్యమైన పత్తి జాతి పంటలకు ఆదిలాబాద్ జిల్లా ప్రసిద్ధి గాంచిందని రాష్ట్రంలోనే పత్తి పండించడంలో ఆదిలాబాదు జిల్లా మొదటి స్థానంలో ఉందని నాణ్యమైన పత్తికి పెట్టింది పేరని ఎన్నోసార్లు ఎన్నికల బహిరంగ సభల్లో కెసిఆర్ చెప్పారని ఆయన తెలిపారు.
అదే విధంగా ఆదిలాబాద్ పత్తి విశిష్టతను ఖ్యాతిని కొనియాడారని ఇప్పుడు పత్తి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఆదిలాబాద్ ప్రజల రుణం తీర్చుకోవాలని ఆయన అన్నారు. ఆదిలాబాద్ జిల్లాకి జాతీయ స్థాయి సంస్థలను ఆదిలాబాద్ జిల్లాకు తీసుకురావడంలో విఫలమయిన నాయకులు ఇప్పటికైనా మేల్కొని ఈ పత్తి పరిశోధనా కేంద్రాన్ని అయినా తీసుకురావాలని ఆయన కోరారు.
ఆదిలాబాదు జిల్లా కేంద్రంలో విశాలమైన అయిదువందల ఎకరాల ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కెసిఆర్ ని ఒప్పించి ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. పత్తి పరిశోధన కేంద్రం ఏర్పాటు జరిగే వరకు సాధన సమితిగా ఏర్పాటై త్వరలోనే రైతు సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు విద్యార్థి సంఘాలు వివిధ నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ రచించి పోరాటం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కస్తాల అరుణ్ కుమార్ ప్రజాసంఘాల నాయకులు బద్దం పురుషోత్తం రెడ్డి,విద్యార్థి నాయకులు ఎలుగు ప్రేమేందర్,మర్రి వెంకన్న యాదవ్ తదితరులు పాల్గొన్నారు.