దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో విద్యార్థులకు సన్నబియ్యం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షల రూపాయల వ్యయంతో అదనపు గదులు ఏర్పాటుకు శంకుస్థాపన చేసి, అనంతరం హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు.
అనంతరం మాట్లాడుతూ హుజూర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులు పనులు ప్రారంభించడం సంతోషకరంగా ఉందని, విద్యార్థులు బాగా రాణించి భవిష్యత్తులో ఎన్నో గొప్ప ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు. కరోనా వైరస్ విపరీతంగా ప్రబలుతున్న సమయంలో కూడా అభివృద్ధి పనులకు ఏమాత్రం ఇబ్బందికరంగా మారకుండా అన్ని జాగ్రత్తలతో తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో ముందుకు నడుస్తుందని, రైతులకు 24 గంటలు కరెంటు ఉచితంగా ఇస్తూ పెట్టుబడి కూడా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు.
కరోనా ప్రబలుతున్న వేళ ప్రతి పంట గింజను సీఎం కేసీఆర్ కొనుగోళ్లు చేయడంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతోందని,కరోనా మహమ్మారినీ జయించాలంటే ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటిస్తూ, మాస్క్ ధరిస్తూ పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ అర్చన రవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, జెడ్ పి టి సి కొప్పుల సైదిరెడ్డి, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ ,స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.