తెలుగుదేశం పార్టీ హయాంలో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి జరగలేదని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వైసీపీ నాయకులు పదే పదే చెబుతుండటం శోచనీయమని మాజీమంత్రి గుండ అప్పల సూర్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు క్యాబినెట్ లో తాను మంత్రిగా 1989లో ఉన్న సందర్భంలో శ్రీకాకుళం వెనకబాటు నుండి బయట పడటానికి విద్యాసంస్థలు తీసుకువచ్చానని తెలిపారు.
ఎచ్చెర్ల లో విద్యా సంస్థ, ప్రస్తుతం అంబేద్కర్ యూనివర్సిటీ, నైరా లో వ్యవసాయ కళాశాల ఇచ్చామని ఇది నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. శ్రీకాకుళం నియోజకవర్గం డేనైట్ జంక్షన్ నాగావళి వంతెన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాబార్డ్ నిధులు నుండి ఇవ్వటం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు.
అదేవిధంగా పట్టణ ప్రజానీకానికి ఇళ్ల పట్టాల కోసం తెలుగుదేశం పార్టీ అప్పటి మున్సిపల్ చైర్మన్ జయంతి తాను శాసనసభ్యునిగా మున్సిపాలిటీ దగ్గర నుంచి స్థలం కొని గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజీవ్ గృహ కల్పన పేరుతో ప్రజలకు అందివ్వటం నిజం కాదా అని అని ప్రశ్నించారు.
అంతేకాకుండా 80 అడుగుల రోడ్డు కూడా వేశామని తెలిపారు. ఈ విషయాలలో నిజ నిర్ధారణ కోసం మేధావుల ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్ జడ్జి జగన్నాధ రావు గాని లేక సీనియర్ పత్రికల విలేకరులు గాని ముందుకు వస్తే తాను వివరాలు ఇచ్చేందుకు సిద్ధమని తెలియజేశారు. రాజకీయ సవాళ్ళు కోసం కాదు ప్రజలకు నిజాలు తెలియాలి అని ఆయన అన్నారు.