సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ వేణుగోపాల సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా శనివారం గజవాహన సేవ అత్యంత వైభవంగా జరిగింది.
ప్రాతః కాలంలో భక్తుల గోత్రనామాలు, విష్ణు సహస్రనామార్చన,గోదాదేవి, రామానుజ అష్టోత్తరాలను అర్చకులు భక్తితో జరిపారు.మహిళా భక్తులు తిరుప్పావై పాశురాలను శ్రావ్యంగా గానం చేశారు.సాయంకాలం దేవాలయంలోని గజవాహనాన్ని సర్వాంగసుందరంగా పట్టు వస్త్రాలతో,పూలమాలలతో అలంకరించి గోదాదేవిని పట్టు వస్త్రాలతో,తులసిదళ మాలలతో,వివిధ జాతుల పుష్ప మాలతో అలంకరించి గజవాహనంపై అధిష్టింపజేసి గుడి సేవ భక్తుల నడుమ ఆనందోత్సవాల మధ్య నిర్వహించారు.ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా దేవాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
భక్తులే బోయులుగా వాహన సేవ ఆద్యంతం గోవింద నామాలతో,జై శ్రీమన్నారాయణ నామంతో,జయ జయ ద్వానాల మధ్య వైభవంగా సాగింది.ఆలయ కార్యనిర్వహణాధికారి గుజ్జుల కొండారెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు.మహిళా భక్తులు హారతులతో గోదాదేవి అమ్మవారికి నీరాజనాలు ఇచ్చారు.వాహన సేవను సమర్పించిన భక్తులు శివకుమార్,అనూష దంపతులను దేవాలయ అర్చకులు స్వామి,అమ్మవార్ల శేష వస్త్రాలతో సన్మానించి ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు, స్థానాచార్యులు,దేవాలయ అభివృద్ధి సమితి సభ్యులు,పట్టణ ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్