వనపర్తిలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ భవన నిర్మాణాన్ని ఆపాలని అఖిల పక్షం ఐక్య వేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు.ప్రజల మనోభావాలకు అనుగుణంగా వనపర్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నా చేసి కమిషనర్ కు రిజిస్టర్ పోస్టు చేశామని ఆయన తెలిపారు. గత కొంతకాలంగా వనపర్తిలో రిజిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మాణం వివాదాస్పదంగా ఉండడంతో భూమి పూజ రోజు ఆపివేయడం జరిగిందని,కానీ మళ్ళీ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ప్రకటించడంతో ఆందోళనలో ప్రజలు ఉన్నారని చెప్పారు.
ఈ విషయమై ఐక్యవేదిక ప్రజలతో భాగస్వామ్యం అయి వారి అభిప్రాయాలు తెలుసుకోగా 99 శాతం అక్కడ వద్దని తెలిపారని చెప్పారు. కానీ ఎవరి ప్రయోజనాలు ఎలా ఉన్నాయో తెలియదని, ప్రజలు, వనపర్తి మున్సిపాలిటీలోని చైర్మన్ తో పాటు 17 మంది అధికార కౌన్సిలర్లు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అక్కడ వద్దని తెలియజేసినా కూడా అక్కడే నిర్మాణం అవుతుందని ప్రకటించడం ప్రజల మనోభావాలను దెబ్బతీయటమే అవుతుందన్నారు.
వనపర్తి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న మంత్రి ఈ విషయంలో పట్టు వీడి ప్రజల అవసరాలను గౌరవించి పట్టణంలోని, అనువైన చోటనే నిర్మించాలని కోరారు. వనపర్తి ప్రజలను, వికలాంగులను, ముసలి వారిని దృష్టిలో ఉంచుకుని మంత్రి, జిల్లా కలెక్టర్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ నిర్మాణాన్ని వెంటనే ఆపి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగానే అఖిలపక్ష ఐక్యవేదిక పోరాడుతుందని,వనపర్తి లో రిజిస్ట్రేషన్ ఆఫీసు నిర్మాణం చేస్తే ప్రజా ఆందోళన, నిరాహార దీక్షలు, వనపర్తి బందు నిర్వహిస్తామని సతీష్ యాదవ్ తెలిపారు.
వనపర్తి మున్సిపల్ కౌన్సిల్ లో మెజారిటీ కౌన్సిలర్లు ముభావంగా ఉన్నారని తెలిపారు. ఆందోళనలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, బంజారా సంఘం రాష్ట్ర నాయకులు శివ నాయక్, సునీల్ నాయక్, సూగురు రాములు, రమేష్, పొట్టి నేని గోపాలకృష్ణ నాయుడు, నరసింహ, సుధాకర్ చారి, రామన్ గౌడ్, రాములు, సురేష్ పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్