రామతీర్థం అట్టుడికి పోతోంది. నీలాచలం కొండపై జరిగిన విగ్రహ ధ్వంసం కేసులో ఇప్పటివరకు పోలీసులు నిందితులను పట్టుకోక పోగా రాజకీయ పార్టీ నేతలు మాత్రం వరుస పెట్టి…నీలాచలం కొండ వద్దకు వస్తున్నారు. దీంతో పోలీసులు మరింత బందోబస్తు నిర్వహించి అప్రమత్తం అయ్యారు.
ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు స్వయంగా మీడియా ద్వారా అటు పార్టీ నేతలకు ఇటు ప్రజలను సంయమనం పాటించాలని మతసామరస్యాన్ని కాపాడాలని కోరారు. అందరూ మత సామరస్యాన్ని కాపాడేందుకు సహకరించాలన్నారు.
రాముడి విగ్రహం ధ్వంసం కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించడంతో రాష్ట్ర సీఐడీ అదనపు డిజి పి.వి.సునీల్ కుమార్ సంఘటనా స్థలంను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనపై మత దుమారం చెలరేగిన విషయం తెలిసిందే.
క్రైస్తవుడైన సునీల్ కుమార్ కు కేసు అప్పగించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనుకున్నట్లుగానే ఆయన ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకే విగ్రహ ధ్వంసం జరిగిందని విచారణ ప్రారంభించకముందే చెప్పేశారు. దాంతో సునీల్ కుమార్ పై విమర్శలు మరింతగా చెలరేగాయి. ఈ నేపథ్యంలో విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు సునీల్ కుమార్ కు బాసటగా నిలిచారు.
ప్రజాహితమే పోలీసు మతమని నమ్మి పోలీసుశాఖలో హోం గార్డు నుండి డీజీపీ వరకు పని చేస్తున్నారన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు నిరంతరం పోలీసు ఉద్యోగులు కర్తవ్య నిర్వహణలో ఉంటున్నారని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు అన్నారు.
నేతలు ఆందోళనకారుల మాటలతో ప్రజలెవ్వరూ అనవసరం గా ఉద్వేగానికి లోను కావద్దని, వివేకంతో ఆలోచన చేయాలని, శాంతియుతంగా వ్యవహరించి, విజ్ఞతను ప్రదర్శించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. మతాలను, కులాలలను పోలీసు అధికారులకు ఆపాదించడం సరికాదన్నారు.
రామతీర్ధం నీలాచలం కొండ పై విగ్రహ ధ్వంసం కేసులో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల ప్రజలు, నాయకులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు. మతాల పేరిట ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు.
మతాల పేరున ధర్నాలు, సభలు, ర్యాలీలు నిర్వహించడం వలన ప్రజలు అశాంతికి గురై, విద్వేషాలు చెలరేగే అవకాశం ఉందన్నారు. ఇటువంటి సంఘటనల వలన సమాజంలో చీలికలు ఏర్పడతాయన్నారు. కావున, ఎవ్వరూ కూడా ప్రజల మధ్య విద్వేషాలు పెంచే విధంగా వ్యవహరించ వద్దని, ప్రతీ ఒక్కరూ పోలీసుశాఖకు సహకరించాలని విశాఖ రేంజ్ డీఐజీ కోరారు.