డిజిటల్ లావాదేవీలు ఎంతో సులభతరం, సురక్షితమని, అయితే వాటి నిర్వహణలో జాగ్రత్త పాటించాలని ములుగు జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి నిర్వహించిన 2 కె వాకథాన్ వాక్ ను జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య, అదనపు కలెక్టర్ వైవి గణేష్ తో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ప్రజలను ఆర్థిక అక్షరాస్యత వైపు నడిపించాలని వ్యూహంతో రిజర్వు బ్యాంకు ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని అన్నారు.
ఇప్పుడు మీ చేతి వేళ్ళ ద్వారా డిజిటల్ బ్యాంకింగ్ ను 365 రోజులు 24 గంటలు నెఫ్ట్/ ఆర్.టి.జి.ఎస్./ ఐ.ఏం.పి. స్./యు.పి .ఐ. ల ద్వారా నగదు రహిత లావాదేవీలు నిర్వహించుకోవచ్చని అన్నారు. అయితే సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మన బ్యాంక్ ఓ.టి.పి లు కాని, పిన్ నెంబర్లు కానీ గోప్యంగా ఉంచాలని, ఉచితంగా వచ్చే డబ్బులకు ఆశపడి వివిధ లింకులను తెరిచి మోసపోవద్దని అన్నారు. మోసపోయినట్లు భావిస్తే 1930, 14448 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
ప్రతి ఒక్కరు తమ కుటుంబ అవసరాలకనుగుణంగా కావలసిన డబ్బు పై బడ్జెట్ అంచనా వేసుకొని, ముందు భవిష్యత్తు కోసం కొంత డబ్బును పొదుపు చేసే అలవాటు చేసుకోవాలని, ఆర్ధిక క్రమశిక్షణ ద్వారా కుటుంబం సంతోషంగా ఉంటుందని అన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల ఈ వారం రోజులు ఆర్ధిక అక్షరాస్యత పై గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ కు సూచించారు.
ఎల్ డి ఎం రాజ్ కుమార్ మాట్లాడుతూ గో డిజిటల్ గో సెక్యూర్ అనే అంశంతో 2020-2025 నాటికి దేశమంతటా ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కలిగించి నగదు రహిత డిజిటల్ లావాదేవీలు నిర్వహించాలన్న సంకల్పంతో భారతీయ రిజర్వు బ్యాంక్ ఈ నెల 13 నుండి 17 వరకు సరైన ఆర్ధిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది అంశంతో ఫైనాన్సియల్ లిటరసీ వారోత్సవాలు నిర్వహిస్తున్నదని అన్నారు.
ఈ ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కేంద్ర ప్రధాన రహదారుల వెంట జిల్లా ఫారెస్ట్ కార్యాలయం వరకు సాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి వెంకటరమణ చారి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తులా రవి, డిపిఆర్ఓ రఫీక్, జిల్లా వైద్యాధికారి ఏ అప్పయ్య, స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ శ్యాం కుమార్, ఏపీ గ్రామీణ వికాస్ బ్యాంక్, యు బి ఐ, డి. సి సి, హెచ్ డీ ఏఫ్ సి, కెనరా బ్యాంకు అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.