తక్కువ ధరకు లభిస్తున్నాయని ఆశతో విడి విత్తనాలు కొని రైతులు మోసపోవద్దని జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు అన్నారు. శుక్రవారం ఖానాపూర్ మండల కేంద్రంలోని విత్తనాలు, రసాయన ఎరువుల దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం కడెం లో దాదాపు 116 నకిలీ పత్తి విత్తనాల బస్తాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు. అలాంటి వారిపై పీడీ యాక్ట్ లో కేసులు కూడా నమోదు చేసేందుకు వెనకాడే ది లేదని హెచ్చరించారు.
వ్యాపారులు స్టాకు లైసెన్సు బిల్ బుక్కులు తదితర వివరాలు సక్రమంగా ఉంచుకోవాలని సూచించారు. వ్యాపారులు రైతులకు విత్తనాలు విక్రయించే సమయంలో అన్ని వివరాలతో కూడిన రసీదులు తప్పకుండా ఇవ్వాలని అత్యాశకు పోయి నకిలీ విత్తనాలు విక్రయించి జైలుపాలు కాకూడదని ఆయన హితవు పలికారు.
జిల్లాలో వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో నిరంతరంగా ఆకస్మిక తనిఖీలు చేపడతామని నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని సూచించారు అలాగే రైతులు కూడా విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని లైసెన్సు కలిగిన వ్యాపారుల వద్ద విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తప్పకుండా తీసుకోవాలని ఆ తర్వాత రశీదులు ను పంట అమ్ముకునే వరకు భద్రపరుచుకోవాలి అని అన్నారు.
నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లు తెలిస్తే 100 కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ తనిఖీలలో నిర్మల్ డిఎస్పీ ఉపేందర్ రెడ్డి, సిఐ ఖానాపూర్ జైరాం నాయక్, ఎస్ఐలు భవాని సేన్, ప్రభాకర్ రెడ్డి, ప్రేమ్ దీప్, రాజేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.