తాగడానికి డబ్బులు ఇవ్వడంలేదని కన్నతల్లినే చంపేశాడో కసాయి కొడుకు. గుంటూరు జిల్లా తెనాలిలో ఈ దారుణ సంఘటన జరిగింది. తెనాలి లోని గంగానమ్మ పేటలో నివసించే 65 ఏళ్ల వృద్ధురాలు శశిదేవి కొడుకు చేతిలో హతం కావడం ఆ ప్రాంతంలో సంచలనం కలిగించింది.
శశీదేవి కుమారుడు ముమ్మనేని లక్ష్మీనారాయణ (40) తాగుడుకు బానిసగా మారాడు. తాను తాగేందుకు తన తల్లి డబ్బులు ఇవ్వడం లేదని కోపంతో నేటి రాత్రి 7.30కి అక్కడే ఉన్న పనస కాయలు కోసే కత్తితో మెడను తెగ నరికి ఇంట్లో నుంచి పరారయ్యాడు.
ఆమెను తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలిస్తుండగా ఆ తల్లి మార్గమధ్యంలోనే చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.