ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చాం అంటూ ప్రతి నిత్యం పబ్లిసిటీ చేసుకుంటున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ప్రణాళికలో చెప్పి మర్చిపోయిన మరో హామీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు గుర్తు చేశారు.
పెళ్లి చేసుకున్న పేద వారిని ఆదుకోవడానికి వైఎస్ఆర్ పెళ్లి కానుక, షాదీ ముబారక్ స్కీమ్ లను అమలు చేస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పిన విషయాన్ని ఆయన తన మూడో లేఖ ద్వారా గుర్తు చేశారు.
గత ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, దుల్హన్ పేరుతో అమలు చేసిన ఈ పథకాన్ని పేరు మార్చడం తప్ప వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.
ఓట్లు దండుకోవడానికి మాత్రమే ఈ పథకాలను ప్రస్తావించి గెలిచిన తర్వాత మైనారిటీల పిల్లలను ఈ విధంగా అన్యాయం చేయడం మంచిది కాదని ఆయన తన లేఖలో ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఈ స్కీం ల కింద ఇచ్చిన సాయం కాకుండా ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ కారణంగా సుమారు రెండు వేల మందికి ఇవ్వలేకపోయిందని ఆయన గుర్తు చేశారు.
వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండు స్కీం ల కింది కనీసం ఒక్కరికి కూడా లక్ష రూపాయల ఆర్ధిక సాయం చేయలేదని రఘురామకృష్ణంరాజు తన లేఖలో పేర్కొన్నారు.
దాదాపుగా రెండున్నర లక్షల మంది వైఎస్ఆర్ పెళ్లి కానుక, షాదీ ముబారక్ స్కీమ్ ల కింద దరఖాస్తు చేసి ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారని రఘురామకృష్ణంరాజు అన్నారు.
ఓట్లు వేయించుకోవడానికి ఇలాంటి సామాజిక సంక్షేమ పథకాన్ని వాడుకుని వదిలేయడం మంచిది కాదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు.