పాలమూరు పట్టణానికే కేంద్ర బిందువుగా, తలమానికంగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని అదే స్థానంలో ఉంచాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ ధర్నా జరిగింది. ఎన్నో ఏళ్ల క్రితం ప్రతిష్ట చేసిన డాక్టర్ బిఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని స్థానం నుండి మార్చవద్దని ఈ రోజు డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ గంటకు పైగా రోడ్డుపై బైఠాయించడం జరిగింది.
రెండు సంవత్సరాల క్రితం కలెక్టర్ గారు నేషనల్ హైవే అథారిటీ వారితో కలిసి దళిత సంఘాల నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో, దళిత సంఘాలు అన్ని ఏకగ్రీవ తీర్మానం చేసి అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడి నుంచి ఎక్కడికి తరలించవద్దని, ఎక్కడ ఉందో అక్కడే ఉంచాలని చెప్పడం జరిగింది. అథారిటీ వారు కూడా మీ అందరి అభిప్రాయం మేరకు అంబేడ్కర్ విగ్రహాన్ని యధాస్థానంలోనే ఉంచుతామని చెప్పడం జరిగింది.
కానీ ఈరోజు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అంబేడ్కర్ విగ్రహాన్ని తరలించే కుట్ర జరుగుతోందని అర్ధమవుతుంది. కావున దళిత సంఘాల ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.
నేటి నిరసన కార్యక్రమంలో తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర అధికార ప్రతినిధి బ్యాగరి వెంకటస్వామి, పూలే అంబేడ్కర్ జాతర కమిటీ జిల్లా అధ్యక్షులు బోయపల్లీ నర్సింహులు, మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాడం బాలరాజు, జాతీయ మాలల ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంచిమి లక్ష్మణ్, డిబిఎస్- తిరుమలయ్య, దళిత ఆద్యాయన వేదిక జిల్లా అధ్యక్షులు సాయిబాబా, డిఎస్పీ ఆనంద్, ఎడ్ల కృష్ణయ్య, కావలి రమేష్, మన్యం చెన్నయ్య, హరేందర్ తదితరులు పాల్గొన్నారు.