బిఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి బాగోతం బయట పెడతామని బహుజన సమాజ్ పార్టీ నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పసుపుల రామకృష్ణ అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో వారు ఆ పార్టీ నేత మునిస్వామి,నాయకులతో కలసి అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు.
అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కొల్లాపూర్ లో ఎప్పుడూ లేని విధంగా అరాచకాలు పెరిగిపోయాయి అన్నారు. ఓటు బ్యాంకు కోసం, స్వార్థ రాజకీయాల కోసం అంబేద్కర్ విగ్రహం పై రాజకీయం చేస్తే సహించబోమని వారు హెచ్చరించారు. దళితుల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను మానుకోవాలన్నారు.
కొందరు స్వార్ధపరులు అంబేద్కర్ విధానాలను మరచి స్వార్ధాలకు పాల్పడుతున్నారు. కొల్లాపూర్ లోని అంబేద్కర్ విగ్రహం జోలికి వస్తే సహించం అన్నారు. లేకుంటే ఆయన అక్రమాల చిట్టా మొత్తం బయటకు తీస్తామని హెచ్చరించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పై గ్రీన్ ట్రిబ్యునల్ కేసు వేసి వాపసు తీసుకోవడానికి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారో ఆ బాగోతం అంత బయట పెడతాం అన్నారు.
అంతే కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచి టీఆర్ఎస్ పార్టీలోకి ఎన్ని కోట్లకు అమ్ముడు పోయారో బయట పెట్టే రోజు వస్తుంది అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేశాడన్నారు. మాసబ్ ట్యాంక్ దగ్గర అంబేద్కర్ విగ్రహం కదిలించాలని చూస్తే ఎలాంటి పరిణామాలు చూశారో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. కొల్లాపూర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని కదిలిస్తే తగిన పరిణామాలు చూడాల్సి వస్తుందన్నారు.
ఎన్నో ఏళ్ల తరబడి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి మార్చాల్సిన అవసరం లేదన్నారు. స్వార్థపరుల లబ్ధి కోసం అంబేద్కర్ విగ్రహం పై రాజకీయం చేస్తే సహించబోమని మునిస్వామి హెచ్చరించారు. కొల్లాపూర్ లో లేనిపోని అలజడిని సృష్టిస్తే బిఎస్పీ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్