ఒక దురదృష్టకర సంఘటనలో వీధి కుక్కలు దాడి చేస్తే ఒక బాలుడు మరణించాడు. ఈ సంఘటన హృదయం ఉన్న అందరిని కలచి వేసింది. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా స్పందించారు. నగరంలో వీదికుక్కల వలన ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించే విధంగా అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నగరంలో వీధి కుక్కలు, కోతుల బెడద నివారణ కు తీసుకోవాల్సిన చర్యలపై GHMC, వెటర్నరీ, హెల్త్ తదితర శాఖల అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో హోంమంత్రి మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీ లత రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, GHMC కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ హెల్త్ శృతి ఓజా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్ లు, డిప్యూటీ జోనల్ కమిషనర్ లు పాల్గొన్నారు.
అంబర్ పేట లో 4 సంవత్సరాల చిన్నారి బాలుడు కుక్కల దాడిలో గాయపడి మృతిచెందడం అత్యంత బాధాకరం అని వారంతా విచారం వ్యక్తం చేశారు. నగరంలో కుక్కల బెడద అధికంగా ఉందని, ప్రజల భద్రత, జీవాల సంరక్షణ కు ప్రభుత్వం సమ ప్రాధాన్యతను ఇస్తుందని చెప్పారు. నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టి కుక్కలకు స్టెరిలై జేషన్ నిర్వహించాలని కూడా మంత్రి ఆదేశించారు. బస్తీలు, కాలనీ ల పై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇప్పటికే GHMC అధికారులు కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సిన్ లను వేసే చర్యలను నిర్వహిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు.
అధికంగా కుక్కలు ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని HMDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, త్రాగునీరు కుక్కలకు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లు గా ఆహారం వేయడం వలన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్ధం చేసుకోవాలని అన్నారు. మాంసపు షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్ధాలను రోడ్లపై వేస్తున్న కారణంగా మటన్, చికెన్ షాపుల వద్ద కుక్కల సంఖ్య ఎక్కువగా పెరుగుతుండటానికి కారణం అవుతున్నాయని పేర్కొన్నారు.
మటన్, చికెన్ షాపుల వద్ద రేపటి నుండి స్పెషల్ డ్రైవ్, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం కుక్కల విషయంలో 8 ప్రత్యేక టీములతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. కోతులు, కుక్కల సమస్య పరిష్కారానికి GHMC టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్ ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ద్వారా పిర్యాదులు చేయొచ్చని వివరించారు.
ప్రభుత్వ పరంగా, జీహెచ్ఎంసి పరంగా ఇన్ని చర్యలు తీసుకుంటుంటే సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మాత్రం ఒక దారుణమైన వ్యాఖ్య చేశాడు. వీధికుక్కలన్నింటిని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇంట్లో వదలాలని, అప్పుడు ఆమె ఆ కుక్కల్ని ప్రేమిస్తుందో లేదో చూడాలని రామ్ గోపాల్ వర్మ అన్నాడు. రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో సిద్ధహస్తుడు. వీధికుక్కల సమస్య ను కూడా వదలకుండా ఈ వివాదాస్పద వ్యాఖ్య చేసిన రామ్ గోపాల్ వర్మ పై ప్రస్తుతం విమర్శల వర్షం కురుస్తోంది.